పాల్వంచ, జూన్ 23: ప్రస్తుత విద్యాసంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల బోధన మాత్రమే ఉండాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ తెలుగు మీడియం బోధించవద్దని ప్రధానోపాధ్యాయులను డీఈవో సోమశేఖర శర్మ ఆదేశించారు. పాల్వంచలోని ఉన్నత పాఠశాలలో గురువారం సాయంత్రం ప్రధానోపాధ్యాయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల బోధన జరగాలన్నారు. విద్యార్థులకు అర్థమయ్యేలా బోధించాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తెలుగు మీడియం బోధన ఉండకూడదన్నారు. ప్రైవేట్ పాఠశాలలకు వెళ్లే విద్యార్థులను కూడా ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేలా కృషి చేయాలన్నారు. సెక్టోరియల్ అధికారి సతీష్, ఎంఈవో శ్రీరాంమూర్తి తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థులకు దుస్తుల పంపిణీ
స్థానిక మేదర బస్తీ, సఫాయి బస్తీ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలోని సుమారు 200 మంది విద్యార్థులకు నూతన దుస్తులను డీఈవో సోమశేఖర శర్మ గురువారం పంపిణీ చేశారు. వీటిని సమకూర్చిన తాటిపల్లి సేవ ట్రస్ట్ అధ్యక్షుడు శంకర్బాబును అభినందించారు. కార్యక్రమంలో జేఐహెచ్ సభ్యుడు అబ్దుల్ బాసిత్, ప్రధానోపాధ్యాయులు కనకవల్లి, అజీమా బాపు తదితరులు పాల్గొన్నారు.
దివ్యాంగ పిల్లలందరినీ బడిలో చేర్పించాలి
ప్రత్యేక అవసరాలున్న దివ్యాంగ పిల్లలందరినీ బడిలో చేర్పించాలని డీఈవో సోమశేఖర శర్మ అన్నారు. ప్రత్యేక అవసరాలున్న పిల్లలకు కొత్తగూడెంలోని భవిత కేంద్రంలో గురువారం సామూహికంగా అక్షరాభ్యాసం చేశారు. అక్కడి ఉపాధ్యాయులు, సిబ్బందితో ఆయన మాట్లాడుతూ.. ప్రత్యేక అవసరాలున్న పిల్లల్లో అర్హతగల వారిని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలన్నారు. జిల్లా సమ్మిళిత విద్య కో ఆర్డినేటర్ సైదులు, ఆర్పీలు శ్రీరాం, అ రుణ కుమారి, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
27న యువ శాస్త్రవేత్తలతో టెలీ కాన్ఫరెన్స్
జిల్లాలోని 6-10 తరగతుల విద్యార్థులు, సైన్స్ ఉపాధ్యాయులకు ఈ నెల 27న మధ్యాహ్నం 2.00 నుంచి 4.00 గంటల వరకు టీ శాట్లో యువ శాస్త్రవేత్తలతో ముఖాముఖి కార్యక్రమం ఉంటుందని డీఈవో సోమశేఖర శర్మ ఒక ప్రకటనలో తెలిపారు. టీ శాట్ సౌకర్యమున్న పాఠశాలల్లోని విద్యార్థులు, ఉపాధ్యాయులు ఈ కార్యక్రమాన్ని తప్పనిసరిగా వీక్షించేలా చూడాలని ఎంఈవోలను ఆదేశించారు. మరింత సమాచారానికి డీఎస్వో చలపతిరాజును 92472 96012 నంబర్లో సంప్రదించవచ్చని సూచించారు.