భద్రాచలం, జూన్ 21: వరదల వల్ల ప్రజలు ఇబ్బందులు పడకుండా చర్యలు చేపట్టాలని భద్రాద్రి కలెక్టర్ అనుదీప్ ఆదేశించారు. గోదావరి వరద సహాయక చర్యలపై అన్ని శాఖల అధికారులతో భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. నిత్యావసర వస్తువుల కొరత రాకుండా చూడాలని, నాలుగు నెలలకు సరిపడా స్టాక్ను సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. ముంపు ప్రాంతాల్లో ఉన్న వసతి గృహాల్లో కూడా నిత్యావసర వస్తువులను అక్టోబర్ వరకు స్టాక్ ఉంచాలన్నారు. ముంపుకు గురయ్యే గ్రామాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాల్సి ఉన్నందున ఆ కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించాలన్నారు. అక్కడ ఏర్పాట్లు పర్యవేక్షించేందుకు ప్రత్యేక అధికారులను నియమించాలని సూచించారు. వరదల సమయంలో ముఖ్యంగా గర్భిణుల ఆరోగ్య పరిరక్షణ చాలా ముఖ్యమని, ముందుగా వారి జాబితాను అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వారీగా సిద్ధంగా ఉంచాలని సూచించారు. వరదల సమయంలో ప్రసవం కోసం వాగులు, వంకలు దాటాల్సిన ప్రమాదాలు ఉన్నందున ముందస్తుగానే వారిని ఆసుపత్రుల్లో వైద్యుల పర్యవేక్షణలో ఉంచాలని ఆదేశించారు. భద్రాచలం సబ్ కలెక్టరేట్లో 08744-232444తో కంట్రోల్ రూంను ఏర్పాటు చేయాలన్నారు. అదనపు కలెక్టర్ కర్నాటి వెంకటేశ్వర్లు, అన్ని శాఖల అధికారులు, తహసీల్దార్లు పాల్గొన్నారు.