భద్రాచలం, జూన్ 21: గిరిజన విద్యార్థులు ఉన్నత విద్య సాధనే లక్ష్యంగా పెట్టుకోవాలని భద్రాచలం ఐటీడీఏ పీవో గౌతమ్ పోట్రు సూచించారు. గిరిజన గురుకులాలు, ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్లు, యూఆర్జేసీ, సీవోఈ, ఎస్వోఈ, గిరిజన గురుకుల ప్రిన్సిపాళ్లతో ఐటీడీఏ సమావేశ మందిరంలో మంగళవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గిరిజన విద్యార్థులు ఉన్నత శిఖరాలు అధిరోహించేందుకు ప్రణాళికాబద్ధమైన విద్యను అందించాలని సూచించారు. 6, 7, 8, 9 తరగతుల్లో ఉన్న బ్యాక్ లాగ్ సీట్లను ప్రవేశ పరీక్ష ద్వారా మాత్రమే భర్తీ చేయాలన్నారు. 5 నుంచి ఇంటర్ వరకు ప్రతి సీటునూ ఎంట్రెన్స్ ద్వారా సెలక్ట్ అయిన వారితో మాత్రమే భర్తీ చేయాలని సూచించారు. అలసత్వం వహించే వారిపై క్రమశిక్షణ చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఐటీడీఏ ఏపీవో జనరల్ డేవిడ్ రాజ్, గిరిజన గురుకులాల ప్రిన్సిపాళ్లు తదితరులు పాల్గొన్నారు.