కరోనా సమయంలో గర్భిణులకు వైద్యసేవలు
ప్రాణాలు ఫణంగాపెట్టి ప్రసవాలు చేస్తున్న వైద్యులు
కొత్తగూడెం ప్రభుత్వాసుపత్రిలో కొవిడ్ బాధితులకూ ప్రసవం
సిబ్బంది సేవలకు కుటుంబ సభ్యులు ఫిదా
కొత్తగూడెం, ఏప్రిల్ 22: బంధాలను బంధువులను దూరం చేసింది కరోనా. లాక్డౌన్ అందరినీ ఇంటికే పరిమితం చేసింది. ఇలాంటి సమయంలో ప్రజలకు వైద్య సేవలందించింది ప్రభుత్వ వైద్యశాలలు మాత్రమే. ముఖ్యంగా గర్భిణుల ప్రసవాలు చేసిందీ ప్రభుత్వ వైద్యశాలల్లోనే. సాధారణ గర్భిణులతో పాటు కరోనా బారిన పడిన గర్భిణులకూ ప్రసవాలు చేశారు. లాక్డౌన్ సడలింపుల తర్వాత ప్రైవేటు వైద్యశాల తెరచుకున్నప్పటికీ అక్కడ పాజిటివ్ వచ్చిన గర్భిణులకు ప్రసవాలు చేసిన దాఖలాలు లేవు. సాధారణ గర్భిణులకు మాత్రమే ప్రసవం చేశారు. కానీ అప్పుడూ ఇప్పుడు.. సాధారణ గర్భిణులతో పాటు కరోనా బారిన పడిన గర్భిణులకు ప్రాణాలకు తెగించి ప్రసవాలు చేస్తున్నది ప్రభుత్వాసుపత్రుల వైద్యులు, సిబ్బంది మాత్రమే.
పీపీఈ కిట్లు ధరించి..
కరోనా బాధితుడి నోటి నుంచి వచ్చే తుంపర మీద పడితే వైద్యులూ వైరస్ బారిన పడడం తప్పదు. ప్రసవం అంటేనే వేదన. గర్భిణులు నొప్పికి తాళలేక ఇబ్బంది పడుతుంటారు. వారి పక్కనే ఉండి సేవలు అందించడం తప్పనిసరి. ఇలాంటి పరిస్థితుల్లో వైద్యులు, నర్స్లు, సిబ్బంది అందరూ పీపీఈ కిట్లు ధరించి ప్రసవాలు చేశారు. తాము కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ఎందరో ప్రాణాలను కాపాడారు.
కరోనా పేరు వింటేనే హడల్..
కొవిడ్ ప్రారంభ సమయంలో కరోనా వైరస్ పేరు వింటేనే హడల్. ఒక కేసు ఎక్కడైనా నమోదైందంటే అక్కడి నుంచి కిలోమీటర్ల దూరం వరకూ కంటైన్మెంట్ జోన్. వారాల తరబడి ఆ రోడ్డును మూసివేసేవారు. ఇక ఊరంతా ఆ కేసు గురించే చర్చే. ఒక మనిషిని తాకాలన్నా, బయటకు ఎక్కడికి వెళ్లాలన్నా భయమే. అలాంటి సమయంలో గర్భిణులకు అండగా నిలిచారు ప్రభుత్వాసుపత్రి సిబ్బంది. వైద్యవృత్తిలో సేవాతత్పరతను చాటుకున్నారు. లోకమంతా ఇంట్లో ఉన్నప్పుడు వారు ఆస్పత్రిలో సేవలందించారు.
ప్రాణాలు కాపాడేది వైద్యులు..
కష్టం ఎవరికొచ్చినా ఒకటే. కరోనా సమయంలో ప్రాణాలను కాపాడేది వైద్యులు మాత్రమే. ప్రసవం అనేది మహిళలకు రెండో జన్మ. అలాంటి సమయంలో వైద్యుల సాయం తప్పనిసరి. మేమంతా ప్రాణాలను లెక్క చేయకుండా ప్రసవాలు చేస్తున్నాం.
స్వప్న, స్టాఫ్ నర్సు, కొత్తగూడెం ఆసుపత్రి
ఆపదలో ఆదుకునే వాళ్లే గొప్పోళ్లు ..
ప్రతి మనిషికి ఏదో ఒక సమయంలో ఆపద వస్తుంది. వాటి నుంచి మనల్ని కాపాడేందుకు చాలా మంది ముందుకు వస్తుంటారు. కానీ వైరస్ సోకిందంటే వారిని పట్టించుకునే పరిస్థితులు ప్రస్తుతం తక్కువగా ఉన్నాయి. ఆపదలో ఆదుకున్నవాళ్లే గొప్పవాళ్లు.
బి.శారద, స్టాఫ్ నర్స్, కొత్తగూడెం ఆస్పత్రి
సొంత బిడ్డల కంటే ఎక్కువగా చూస్తాం..
ప్రభుత్వ ఆసుపత్రేగా.. అని చాలా మంది చులనకగా మాట్లాడతారు. కానీ మాకూ మానవత్వం ఉంటుంది. గర్భిణి అవస్థలు మాకు తెలుసు. ఇక్కడికి వచ్చిన వారిని సొంత పిల్లల కంటే ఎక్కువగా చూసుకుంటాం.
కాసాని రాధాకుమారి, హెడ్ నర్స్, కొత్తగూడెం ఆస్పత్రి
ఇవి కూడా చదవండి
త్రివిక్రమ్ టాలీవుడ్ జర్నీ@ 22 ఇయర్స్
విజయ్ సేతుపతి ‘విదుతలై’ ఫస్ట్ లుక్