హైదరాబాద్, జూలై 10 (నమస్తే తెలంగాణ): డీఎస్పీ క్యాటగిరీ-2 ఉద్యోగాల నియామక వివాదంపై ఈ నెల 28లోగా పూర్తి వివరాలు అందజేయాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఇప్పటికే అనేకసార్లు గడువు ఇచ్చామని, ఇకపై వాయిదాలు కుదరవని తేల్చిచెప్పింది. డైరెక్ట్గా రిక్రూటైన డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (సివిల్ ) అధికారుల పరస్పర (ఇంటర్ సే) సీనియారిటీ నిర్ణయానికి సంబంధించి జారీచేసిన జీవో 123లోని నిబంధనలను సవాలు చేస్తూ నల్లగొండ జిల్లా గుర్రంపోడుకు చెందిన ఎం శ్రీకాంత్ సహా 64 మంది సవాలు చేసిన పిటిషన్పై హైకోర్టు చీఫ్ జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్ ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది.
పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాదులు అవినాశ్ దేశాయ్, సుబ్రహ్మణ్య శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ.. ఒకే హోదా, ఒకే గ్రేడ్, ఒకే క్యాడర్లో పనిచేస్తున్న ఉద్యోగుల్లో ఎవరు సీనియర్లో, ఎవరు జూనియర్లో నిర్ణయించే నిర్ణయించే విధానాన్ని మార్చడం అన్యాయమని పేర్కొన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 16 పేర్కొంటున్న సమానత్వ హకు, ప్రభుత్వ ఉద్యోగాల్లో సమాన అవకాశాలకు వ్యతిరేకంగా జీవో 123 ఉన్నదని తెలిపారు. ప్రభుత్వం జారీచేసిన కొత్త నిబంధనలను రద్దు చేసి, తెలంగాణ స్టేట్ అండ్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్లోని 33వ నిబంధన ప్రకారం పిటిషనర్లతోపాటు అదే బ్యాచ్ అధికారుల సీనియారిటీని నిర్ణయించే విధంగా ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలని కోరారు.
జీవో 123 జారీకి ముందే డీఎస్పీలుగా నియమితులైన వారికి కొత్త నిబంధనలు వర్తింపజేయకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై ప్రభుత్వ న్యాయవాది ప్రతివాదన చేస్తూ.. హోంశాఖ జాయింట్ సెక్రటరీ ఈ నెల 4న జారీ చేసిన లిఖితపూర్వక సూచనల మేరకు ఈ వ్యవహారం ప్రభుత్వ పరిశీలనలో ఉన్నదని తెలిపారు. దీనిపై వివరణ ఇచ్చేందుకు గడువు కావాలని కోరడంతో పిటిషనర్ల న్యాయవాదులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. క్యాటగిరీ-2 డీఎస్పీల శిక్షణ ఆగస్టుతో పూర్తికానున్న దశలో కూడా ప్రభుత్వం తన నిర్ణయం వెల్లడించకపోతే ఎలాగని ప్రశ్నించారు. దీంతో ఈ వివాదంపై వివరాలు సమర్పించేందుకు ప్రభుత్వానికి చివరి అవకాశం ఇస్తున్నట్టు హైకోర్టు ప్రకటించింది.