ఖమ్మం, మే 22 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/ ఖమ్మం: ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో లాక్డౌన్ కొనసాగుతోంది. 11వ రోజు శనివారమూ కట్టుదిట్టంగా అమలైంది. నిత్యావసర సరుకుల కొనుగోలు, ఇతర అత్యవసర పనుల కోసం ప్రభుత్వ అనుమతిచ్చిన ఉదయం 6 గంటల నుంచి 10 గంటల సమయంలో ప్రజలు తమకు కావాల్సిన వస్తువులన్నీ కొనుగోలు చేసుకొని వెళ్తున్నారు. కూరగాయలు, పాలకేంద్రాలు, నిత్యావసర దుకాణాల వద్ద ఆ సమయంలో రద్దీ ఎక్కువగా ఉంటోంది. శుక్రవారం వరంగల్ నుంచి సీఎం కేసీఆర్ వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించి లాక్డౌన్ను మరింత కఠినతరంగా అమలు చేయాలని ఆదేశించిన నేపథ్యంలో ఈ రెండు జిల్లాలో పోలీసులు లాక్డౌన్ను పోలీసులు కట్టుదిట్టంగానే అమలు చేశారు. స్వయంగా సీపీ కూడా వాహనాలను తనిఖీ చేశారు.
స్వీయ రక్షణలో ఉండాలి: సీపీ
కరోనా తీవ్రతను నిరోధించేందుకు ప్రభుత్వం విధించిన లాక్డౌన్ నేపథ్యంలో ప్రజలందరూ స్వచ్ఛందంగా స్వీయ రక్షణలో ఉండాలని సీపీ విష్ణు వారియర్ సూచించారు. ఈ మేరకు జిల్లా ప్రజలకు శనివారం పలు సూచనలు చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై విపత్తు నిర్వహణ చట్టంలోని 188 ఐపీసీ ప్రకారం 51 నుంచి 60 సెక్షన్ల ద్వారా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
నగరంలో అడుగడుగునా తనిఖీలు
లాక్డౌన్ ఆంక్షలు అతిక్రమించి సరైన కారణాలు లేకుండా రోడ్లపై తిరుగుతున్న 230 వాహనాలను (215 బైకులు, మూడు కార్లు, 12 ఇతర వాహనాలు) శనివారం సీజ్ చేసినట్లు సీపీ విష్ణు ఎస్ వారియర్ తెలిపారు. కరోనా వైరస్ కట్టడికి విధించిన లాక్డౌన్న మరింత కఠినంగా అమలు చేసేందుకు జిల్లా వ్యాప్తంగా అడుగడుగునా తనిఖీలు చేపట్టినట్లు చెప్పారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 15 సరిహద్దు చెక్పోస్టులు, 15 అంతర్గత రహదారిపై ఉన్న చెక్పోస్టులు, 37 పోలీస్ పికెటింగ్స్, 30 మొబైల్ పెట్రోకార్స్ శనివారం ఉదయం 10 గంటల తరువాత విస్తృతంగా వాహనాల తనిఖీ చేపట్టాయన్నారు.