– రూ.3.5 లక్షలు లంచం తీసుకుంటూ దొరికిన ఎఫ్డీఓ, డీఆర్ఓ
భద్రాచలం, మే 7 : రోడ్డు నిర్మాణ పనుల్లో చెట్ల నరికివేత వ్యవహారాన్ని సాకుగా చూపి, ఓ కాంట్రాక్టరు నుండి లంచం డిమాండ్ చేసిన భద్రాచలం అటవీ శాఖ ఉన్నతాధికారులు ఇద్దరు రెడ్ హ్యాండెడ్గా ఏసీబీకి చిక్కారు. చర్ల మండలం పూసగుప్ప ప్రాంతంలో కొత్తగా రోడ్డు వేస్తున్న సమయంలో అటవీ శాఖకు చెందిన పలు చెట్లను తొలగించాల్సి వచ్చింది. నిబంధనల ఉల్లంఘనను సాకుగా చూపి సదరు కాంట్రాక్టరుపై చర్యలు తీసుకోకుండా ఉండేందుకు భద్రాచలం ఫారెస్ట్ డివిజనల్ ఆఫీసర్(FDO) సుజాత, చర్ల ఇన్చార్జి(DRO) కృష్ణయ్య ఏకంగా రూ. 10 లక్షలు డిమాండ్ చేశారు. అంత భారీ మొత్తాన్ని ఇచ్చుకోలేక సదరు బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారి సూచన మేరకు గురువారం మొదటి విడతగా రూ.3.5 లక్షలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ డీఎస్పీ వై.రమేష్ బృందం మెరుపు దాడి చేసింది. డబ్బుతో సహా అధికారులను అదుపులోకి తీసుకున్నారు.