భద్రాచలం, ఫిబ్రవరి 10: కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరవాలని, తక్షణం పార్లమెంట్లో బిల్లు పెట్టి ఏపీలో కలిపిన ఐదు పంచాయతీలను తెలంగాణలో కలపాలని, అప్పుడే భద్రాచలం అభివృద్ధి సాధ్యమవుతుందని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రావులపల్లి రాంప్రసాద్ అన్నారు. అఖిలపక్షం ఆధ్వర్యంలో గురువారం చేపట్టిన భద్రాచలం బంద్ విజయవంతమైంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా తక్షణమే పార్లమెంట్లో బిల్లు పెట్టాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో భద్రాద్రి ప్రజల ఆవేదనను, ఆందోళనను దేశవ్యాప్తంగా వినిపిస్తామని స్పష్టం చేశారు. విభజనతో భద్రాచలం పట్టణం ఏకాకిగా మిగిలిందని, 5 పంచాయతీలు ఇవ్వకపోతే ఈ ప్రాంతానికే మనుగడ కష్టమని అన్నారు. ఏపీ ప్రభుత్వం కూడా ఆ 5 గ్రామ పంచాయతీలను తెలంగాణకు ఇచ్చేందుకు ఆలోచించాలని కోరారు. ఈ బంద్లో సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్, టీడీపీ, ఎన్డీ, ప్రజా సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.