– మైనార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎండీ యాకూబ్ పాషా
రుద్రంపూర్ జూలై 15 : తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ ఉచిత శిక్షణకు బీసీ-ఈ (ముస్లిం) క్యాటగిరీకి చెందిన అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని తెలంగాణ మైనార్టీ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎండీ యాకూబ్ పాషా బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం బీసీ స్టడీ సర్కిల్ ద్వారా అందిస్తున్న ఈ ఉచిత కోచింగ్ అవకాశాన్ని బీసీ-ఈ వర్గానికి చెందిన ముస్లిం యువత సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కోచింగ్కు మొత్తం 100 మంది అభ్యర్థులను ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. ఈ నెల 17 నుంచి ఆగస్టు 7 వరకు దరఖాస్తులను స్వీకరిస్తున్నారని, అర్హత కలిగిన వారికి ఆగస్టు16న ఆన్లైన్లో స్క్రీనింగ్ టెస్టు నిర్వహించి అందులో మెరిట్ సాధించిన వారికి ఆగస్టు 24 నుండి క్లాసులు నిర్వహించడం జరుగుతుందన్నారు.
డిగ్రీ అర్హత కలిగి కుటుంబ వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో 1.50 లక్షల లోపు, పట్టణ ప్రాంతాల్లో 2.00 లక్షలోపు కలిగి ఉండాలని, ఆసక్తి గల అర్హులైన అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ tgbcstudycircle.cgg.gov.in ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. సివిల్స్ వంటి అత్యున్నత పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న బీసీ-ఈ ముస్లిం యువత ఈ అరుదైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఉన్నత లక్ష్యాలను సాధించాలని యాకూబ్ పాషా పిలుపునిచ్చారు. ఇతర వివరాలకై 8520860785 నంబరును సంప్రదించాలని కోరారు.