చుంచుపల్లి, మే 26 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆదేశాల మేరకు చుంచుపల్లి మండలం రామాంజనేయ కాలనీలో షీ టీం, ఏహెచ్టీయూ, భరోసా ఆధ్వర్యంలో బాల్య వివాహాల నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు బాల్య వివాహ నిరోధక చట్టం గురించి ప్రజలకు వివరించారు. చిన్న వయస్సులో వివాహాలు జరగడం వల్ల బాలికల ఆరోగ్యం, విద్య, భవిష్యత్పై తీవ్ర ప్రభావం పడుతుందని తెలిపారు. అలాగే చదువుతో కలిగే ప్రయోజనాలు, బాలికలు ఉన్నత విద్యను అభ్యసించి స్వయం సమృద్ధి సాధించాల్సిన అవసరాన్ని వివరించారు. ఎక్కడైనా బాల్యవివాహాలు జరుగుతున్నట్లు సమాచారం తెలిసిన వెంటనే అధికారులకు తెలియజేయాలని కోరారు. ఈ సందర్భంగా షీ టీం హెల్ప్లైన్ నంబర్ 8712682131 మరియు చైల్డ్ లైన్ 1098 నంబర్లను ప్రజలకు తెలియజేశారు. కార్యక్రమంలో కాలనీ ప్రజలు, మహిళలు, యువత పాల్గొన్నారు.