రుద్రంపూర్, జూన్ 02 : కృషి విజ్ఞాన కేంద్రం, భద్రాద్రి కొత్తగూడెం ఆధ్వర్యంలో భారత ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 30 రోజుల “ఖేతి బచావో అభియాన్” కార్యక్రమంలో భాగంగా చుంచుపల్లి మండలం పెనగడప గ్రామంలోని అంబేద్కర్ నగర్లో మట్టి పరీక్షలు, సమతుల్య ఎరువుల వినియోగంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డా. టి. భరత్ మాట్లాడుతూ.. రైతులు పోటీతత్వంతో మోతాదుకు మించి ఎరువులు వినియోగించడం వల్ల భూసారం తగ్గిపోతుందని తెలిపారు. రైతులు తప్పనిసరిగా మట్టి పరీక్షలు చేయించుకొని, ఫలితాల ఆధారంగా ఎరువులను వినియోగించాలని సూచించారు. అలాగే మార్కెట్లో డిమాండ్ ఉన్న వరి రకాలను, ముఖ్యంగా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం విడుదల చేసిన రకాలను సాగు చేయాలని కోరారు.
కృషి విజ్ఞాన కేంద్రం ద్వారా అందుబాటులో ఉన్న డబ్ల్యూజీఎల్-44 (సిద్ధి), కెఎన్ఎం-1638 వరి రకాలను సాగు చేసి అధిక దిగుబడులు సాధించాలని సూచించారు. ఉద్యాన శాస్త్రవేత్త శివ మాట్లాడుతూ రైతులు ఇంటి వద్దనే ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో కూరగాయలు సాగు చేయాలని తెలిపారు. ఒకే రకమైన పంటలను సాగు చేయడం వల్ల గిట్టుబాటు తగ్గుతోందని, ఆయిల్ పామ్, మునగ, తీగజాతి కూరగాయలు వంటి ఉద్యాన పంటలతో పంట మార్పిడి పాటించడం ద్వారా స్థిరమైన ఆదాయం పొందడంతో పాటు నేల ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవచ్చని వివరించారు. అనంతరం రైతులకు మట్టి నమూనాల సేకరణ విధానాన్ని ప్రదర్శించి వివరించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఈసం శిరీషతో పాటు సుమారు 120 మంది రైతులు పాల్గొన్నారు.