దమ్మపేట: పామాయిల్ దీర్ఘకాలిక ఆదాయానిచ్చే పంట అని అశ్వారావుపేట ఆయిల్ఫెడ్ డివిజినల్ అధికారి ఉదయ్ కుమార్ అన్నారు. రైతులకు క్షేత్ర స్థాయి అధ్యయనంలో భాగంగా దమ్మపేట మండలంలో పామాయిల్ సాగు గురించి ఆయన వివరించారు. ఈ సందర్భంగా ఉదయ్ కుమార్ మాట్లాడుతూ పామాయిల్ మొక్కలు నాటిన తరువాత కాతకు వచ్చే మూడు సంవత్సరాల వరకు అంతర పంటలు సాగు చేసుకోవచ్చన్నారు. పామాయిల్ జీవిత కాలం 30 ఏళ్లని రైతులకు వివరించారు. దేశంలో వంట నూనెలకు కొరత వుందని పామాయిల్కు బంగారు భవిష్యత్ ఉంటుందని అన్నారు.
పామాయిల్ రైతులు దారా తాతారావు మాట్లాడుతూ పామాయిల్ రైతుల ఆర్థిక పరిస్థితిని మార్చివేసిందన్నారు. ప్రభుత్వ, ప్రయివేటు ఉద్యోగి జీవితం కంటే ఎక్కువగా పామాయిల్ రైతుల జీవనం ఉంటుందన్నారు. చాలినంత సాగు నీరు అందుబాటులో వుండి, నీరు నిల్వవుండని భూములు పామాయిల్ సాగుకు అనుకూలమన్నారు. అధ్యయనానికి వచ్చిన రైతులు పామాయిల్తో పాటు ఈప్రాంతంలో పండుతున్న పంటలను చూసి ముగ్ధులయ్యారు. ఈ కార్యక్రమంలో అప్పారావుపేట పామాయిల్ ఫ్యాక్టరీ మేనేజర్ శ్రీకాంత్ రెడ్డి, ఫీల్డ్ స్టాఫ్ ప్రవీణ్, సతీష్ తదితరులు పాల్గొన్నారు.