బూర్గంపహాడ్, ఏప్రిల్ 07 : డల్లాస్ ఎంఎస్ సెరెంగెటీ (టెక్సాస్-యూఎస్ఏ) ఆర్ధిక సహకారంతో బూర్గంపహాడ్ మండల పరిధిలోని రాజీవ్నగర్ ఆదివాసీ గ్రామంలో నిర్మించిన అంగన్వాడీ కేంద్ర భవనాన్ని ఐసీడీఎస్ సీడీపీఓ రేవతి మంగళవారం ప్రారంభించారు. చిన్నారులు, గర్భిణులు, బాలింతలు అంగన్వాడీ కేంద్రానికి సొంత భవనం లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్న విషయాన్ని ఖమ్మంకు చెందిన సామాజిక సేవకురాలు, ఉపాధ్యాయురాలు రూప్లా నాయక్, కొంగర పురుషోత్తమరావు, రామచంద్రరావు దృష్టికి తీసుకువెళ్లగా వారు స్పందించి యూఎస్ఏలో ఉన్న కుటుంబ సభ్యుల సహకారంతో రూ.2 లక్షలతో నూతన భవనాన్ని నిర్మించారు. ఈ భవనాన్ని ఐసీడీఎస్ సీడీపీఓ రేవతి లాంఛనంగా ప్రారంభించి ఐసీడీఎస్ శాఖకు అధికారికంగా అప్పగించారు. అనంతరం అంగన్వాడీ కేంద్రంలో గర్భిణులకు సీమంత కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఐటీసీ ఐజీడీ ప్రమీల, సెక్టార్ సూపర్వైజర్లు, అంగన్వాడీ టీచర్లు, గ్రామస్తులు, వార్డు సభ్యులు భీమరాజు, భద్రయ్య, దేవయ్య, జోగయ్య పాల్గొన్నారు.