రుద్రంపూర్, మార్చి 02 : పూజ గదిలో దేవుడి కోసం వెలిగించిన దీపం ఇంటిని దహనం చేసింది. సింగరేణి కొత్తగూడెం ఏరియా పరిధి రుద్రంపూర్ పంచాయతీ పరిధిలోని గోపి ఏరియాలో సోమవారం చోటుచేసుకున్న అగ్నిప్రమాదం స్థానికులను ఉలిక్కిపడేలా చేసింది. అయితే రంజాన్ మాసం ఉపవాసంలో ఉన్న యువకుల సాహసంతో పెను ప్రమాదం తప్పింది. గోపి ఏరియాలోని క్వార్టర్ నం.D-285లో నివసిస్తున్న గుత్తుల దుర్గాప్రసాద్ కుటుంబం పూజ గదిలో దీపాలు వెలిగించి బయటకు వెళ్లింది. కొద్ది సేపటికే పూజ గదిలో మంటలు చెలరేగి ఇంటి ఇతర గదులకు వ్యాపించాయి. ఒక్కసారిగా ప్రాంతమంతా దట్టమైన పొగతో కమ్ముకోవడంతో చుట్టుపక్కల వారు భయాందోళనకు గురయ్యారు. మంటలు వంటగదిలోని గ్యాస్ సిలిండర్ వైపు చేరుతున్నాయని గమనించిన యువకులు అజార్, జాఫర్ ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా ఇంట్లోకి దూసుకెళ్లారు. రంజాన్ ఉపవాసంలో ఉండి, రోజంతా ఆహారం తీసుకోకపోయినా మండుతున్న వేడి, కళ్లను మండించే పొగను తట్టుకుని సిలిండర్ను బయటకు తీసుకువచ్చారు. ఆ సమయంలో ఒక్క చిన్న నిర్లక్ష్యం జరిగినా పెద్ద విషాదం జరిగేదని స్థానికులు చెబుతున్నారు.
ఇంటి పైకప్పు రేకులను పగలగొట్టి పైపులైన్ ద్వారా నీటిని చల్లుతూ మంటలను అదుపులోకి తెచ్చారు. వారి ధైర్యసాహసాల వల్ల మంటలు మరింత విస్తరించకుండా ఆగిపోయాయి. ఈ ఘటనలో ఇంటి సామగ్రి, మంచాలు, ఫ్రిజ్ తదితర గృహోపకరణాలు కాలిపోయినా ప్రాణనష్టం జరగకపోవడం ఊరట కలిగించింది. రంజాన్ మాసంలో ఉపవాసంలో ఉన్నప్పటికీ “మనిషి ప్రాణమే ముందుగా” అన్న భావనతో ప్రాణాలను పణంగా పెట్టి ముందుకొచ్చిన ఈ యువకులను స్థానికులు అభినందిస్తున్నారు. మతం, కాలం, పరిస్థితి ఏమిటన్నది పక్కనపెట్టి మానవత్వం గెలిచిందని ప్రశంసిస్తున్నారు. ఈ ఘటన రుద్రంపూర్ ప్రాంతంలో యువతలో ఉన్న సేవాభావానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది.

సింగరేణి క్వార్టర్లలో తప్పిన పెను ప్రమాదం