‘బ్లాస్టింగ్’ బాధితులకు ‘డబుల్’ ఇళ్లు మంజూరుచేయండి
ముఖ్యమంత్రి కేసీఆర్కు సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వినతి
సత్తుపల్లి, జూలై 16: ఎన్నో ఏళ్లుగా ఇళ్లస్థలాలు లేక ఇబ్బందులు పడుతున్న పట్టణంలోని నిరుపేదలకు ప్రభుత్వ అటవీశాఖ ఆధ్వర్యంలో ఉన్న టింబర్ డిపో స్థలాన్ని కేటాయించాలని, సింగరేణి బాంబ్ బ్లాస్టింగ్ వద్ద ఇళ్లు దెబ్బతిన్న నిర్వాసితులకు డబుల్ బెడ్రూం ఇళ్లను మంజూరు చేయాలని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య కోరారు. ఈ మేరకు శుక్రవారం హైదరాబాద్లోని ప్రగతిభవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ను కలిసి విన్నవించారు. ఇటీవల తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య.. ఈ సందర్భంగా స్వామివారి ప్రసాదాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్కు అందజేశారు. అనంతరం నియోజకవర్గ, సత్తుపల్లి మున్సిపల్ సమస్యలపై వినతిపత్రం అందజేశారు. సింగరేణి పేలుళ్ల వల్ల వెంగళరావునగర్, ఎన్టీఆర్నగర్, విరాట్నగర్, జలగంనగర్లలో ఇళ్లు దెబ్బతిన్నాయని అన్నారు. వారికి డబుల్ ఇళ్లు కేటాయించాలని, 35 ఎకరాల్లో విస్తరించి ఉన్న ప్రభుత్వ టింబర్ డిపో స్థలాన్ని నిరుపేదల ఇళ్ల స్థలాలకు కేటాయించాలని కోరారు. కాకర్లపల్లి గ్రామం నుంచి వైకుంఠధామం వరకు బీటీ రోడ్డు, అదే గ్రామం నుంచి బేతుపల్లి చెరువు కట్ట మీదుగా తాళ్లమడ వరకు, లంకపల్లి నుంచి గుర్వాయిగూడెం మీదుగా కిష్టారం వరకు, టేకులపల్లి నుంచి మధ్యలో బ్రిడ్జీ సహా కొర్లగూడెం వరకు, మర్లపాడు నుంచి అమ్మపాలెం వరకు బీటీ రోడ్లు నిర్మించాలని విన్నవించారు. రామన్నపాలెం గ్రామంలో పూర్వం నిర్మించిన వంతెన శిథిలావస్థకు చేరడంతో కొత్త వంతెన నిర్మాణానికి నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. నియోజకవర్గంలో సమస్యలపై సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించి అప్పటికప్పుడు ఫారెస్ట్ చీఫ్ సెక్రటరీ శాంతకుమారికి ఫోన్ చేసి సమస్యను పరిష్కరించాలని సూచించారు. ఎమ్మెల్యే వెంట మున్సిపల్ చైర్మన్ కూసంపూడి మహేశ్ ఉన్నారు.