ఆన్లైన్ క్లాసెస్తో తల్లిదండ్రులు, విద్యార్థుల్లో ఆందోళన
మానసిక ఒత్తిడికి గురవుతున్న వైనం
ఏకధాటిగా ఐదారు గంటలపాటు తరగతులు
కంటి, చెవి సమస్యలతో సతమతం
మొబైల్ ఫోన్కు బానిసలవుతున్న విద్యార్థులు
పేద విద్యార్థులకు తప్పని ఆర్థిక భారం
లక్ష్మీదేవిపల్లి, ఆగస్టు 11; ఆన్లైన్.. ఆన్లైన్ ఎక్కడ చూసినా.. విన్నా ఆన్లైన్ తరగతులు గోల.. కరోనాతో విద్యారంగం కుదేలైంది. విద్యార్థులను తరగతి గదికి దూరం చేసి సెల్ఫోన్కు చేరువ చేసింది.. ఇది క్రమక్రమంగా వారిని బానిసగా మార్చింది.. ఆన్లైన్ తరగతులతో విద్యార్థులు సెల్ఫోన్కే అంకితమవుతున్నారు. క్లాస్లు పూర్తి అయినా ఫోన్లోనే లీనమవుతున్నారు. అంతేకాదు, తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. అయితే, ఈ ఒత్తిడి జయించడం ఎలా..? తదేకంగా సెల్ఫోన్ చూడడం, వినడం వల్ల కండ్లు, చెవులపై ఎలాంటి ప్రభావం చూపుతాయి.? తదితర అంశాలతో ‘నమస్తే తెలంగాణ ’ కథనం. –
ఆన్లైన్ క్లాసుల పేరు వింటేనే ‘అమ్మో..’ అనే పరిస్థితి నెలకొంది. ఈ క్లాసులతో విద్యార్థులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. అదే పనిగా ఐదారు గంటల పాటు తరగతులు వినాల్సి రావడంతో మానసిక అలసటకు గురవుతున్నారు. ఇటు కంటి సమస్యలూ పెరుగుతున్నాయి. అటు రేడియేషన్ ప్రభావం ఎక్కువవుతుందేమోనని తల్లిదండ్రులు ఆందోళనచెందుతున్నారు. ఇక విద్యార్థులను తలనొప్పి, ఒళ్లునొప్పులు వెంటాడుతున్నాయి. పనిలోపనిగా గేమ్స్, యూట్యూబ్ వంటివి వినియోగిస్తూ విద్యార్థులు మొబైల్కు బానిసవుతున్నారు. దీంతో వారి భావి భవితపై తీవ్ర ప్రభావం పడే ప్రమాదం ఏర్పడుతోంది. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో ఆన్లైన్ క్లాసులే ప్రత్యామ్నాయం అయినా.. అవి విద్యార్థుల మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతున్నాయి.
పాఠశాలలు బంద్ కావడంతో..
కరోనా విజృంభణతో 2020 మార్చి నుంచి పాఠశాలలు బంద్ చేశారు. 2021 విద్యాసంవత్సరంలో కొద్ది రోజులు తెరిచినా కరోనా మళ్లీ కలవరపెట్టడంతో పాఠశాలల మూత తప్పలేదు. ప్రత్యామ్నాయంగా ఆన్లైన్ క్లాసులు కొనసాగుతున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో టీ-శాట్, దూరదర్శన్ ద్వారా కూడా తరగతులు బోధిస్తున్నారు. విద్యార్థులు ఎక్కువగా ఈ ఆన్లైన్ క్లాసులు వినేందుకు సెల్ఫోన్లు వినియోగిస్తున్నారు. పేద విద్యార్థుల తల్లిదండ్రులకు అవి భారమవుతున్నాయి. ఇక గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న విద్యార్థులను సిగ్నల్ సమస్య వేధిస్తోంది. కొన్ని చోట్ల సిగ్నల్ కోసం చెట్లు ఎక్కుతున్న పరిస్థితులు కూడా కన్పిస్తున్నాయి. మరో వైపు విద్యార్థులు ఆన్లైన్ పాఠాలపై పెద్దగా శ్రద్ధ పెట్టడం లేదనే ప్రచారం కూడా జరుగుతోంది.
అలసిపోతున్న విద్యార్థులు..
వయసుతో సంబంధం లేకుండా అన్ని తరగతుల విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులు కొనసాగుతున్నాయి. నిర్విరామంగా సబ్జెక్టులు బోధిస్తుండడంతో విద్యార్థులు బాగా అలిసిపోతున్నారు. కనీసం వారికి మానసిక విశ్రాంతి కూడా ఉండడం లేదు. దీంతో వారిని ఆనారోగ్యం వెంటాడుతోంది. తీవ్రమైన కోపం, చిరాకు వంటి వాటిని ప్రదర్శిస్తున్నారు. కళ్ల మంటలు, తలనొప్పి వంటివాటితోపాటు సైడ్ ఎఫెక్టులు కూడా తీవ్రంగా కన్పిస్తున్నాయి. ఆన్లైన్ పాఠాలు వినడానికి ఇయర్ ఫోన్స్ వినియోగించాల్సి రావడంతో కొందరు విద్యార్థులను చెవినొప్పి సమస్య వెంటాడుతోంది. ఇదిలా ఉండగా.. కొంతమంది విద్యార్థులకు అసలు ఆన్లైన్ క్లాసులకు హాజరుకావడం లేదు.
అదే పనిగా చూస్తే కంటికి ప్రమాదమే..
అదే పనిగా సెల్ఫోన్ చూడటం వల్ల కంటి సమస్యలు వస్తాయి. చిన్న వయసులోనే కంటి సమస్యలు వస్తే ఇబ్బందికరం. క్రమంగా చూపు మందగించే ప్రమాదం ఉంది. ఇప్పటికే చాలా మంది విద్యార్థులు కంటి సమస్యతోపాటు తలనొప్పితో బాధపడుతున్నారు. ఆన్లైన్ క్లాసులతో ఈ సమస్యలు మరింత పెరిగాయి.
-హిమబిందు, కంటి వైద్య నిపుణులు, భద్రాద్రి జిల్లా