సత్తుపల్లి, మార్చి 16 : జిల్లాలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల ఆరోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించింది. విద్యార్థుల అనారోగ్య సమస్యలను దూరం చేసి జ్ఞాపక, రోగనిరోధక శక్తిని పెంచడానికి, మానసిక ఒత్తిడిని దూరం చేయడమే లక్ష్యంగా ఔషధ కిట్ల పంపిణీకి శ్రీకారం చుట్టింది. వివిధ రకాల పోషక పదార్థాలు కలిగిన వస్తువులతో కూడిన కిట్ను ఈ నెల 17 నుంచి 21వరకు ఆయుష్ శాఖ ద్వారా పంపిణీ చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది.
ఇందుకుగాను ఖమ్మం జిల్లాలోని 17 పాఠశాలలను ఎంపిక చేయగా.. 5,199 మంది విద్యార్థులకు అందించనున్నది. వీటిని వైద్యారోగ్యశాఖ విద్యాశాఖ సంయుక్తంగా అందజేసేందుకు ఆశాలు, అంగన్వాడీలు, ఏఎన్ఎం, ఉపాధ్యాయులను భాగస్వామ్యులు చేసి కిట్లను పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు పూర్తిచేసింది. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో 400 ప్రభుత్వ పాఠశాలలను ఎంపిక చేయగా ఖమ్మం జిల్లాలో 17 పాఠశాలలను ఎంపిక చేసింది. పాఠశాలలో ప్రతి విద్యార్థికి 50 గ్రాముల రాగి లడ్డూను అందజేస్తుండగా పది విద్యార్థులందరికీ ఆయుష్ ఆధ్వర్యంలో కిట్లు అందజేయనున్నది.
ఔషధ కిట్లో ఉండేవి..
ఒక్కో కిట్లో బ్రహ్మగుళికలు (ఆయుర్వేదం) 100 గ్రాములు, మంజున్-ఈఫల్ సఫా(యునాని) 100 గ్రాములు, అల్ఫా, అల్ఫాసిరప్ (హోమియో) 100 ఎంఎల్, సెరంఫాస్ 6-ఎక్స్ టాబ్లెట్లు హోమియో 20 గ్రాములు, 50 గ్రాముల రాగి లడ్డూ ఉంటాయి.
జ్ఞాపకశక్తి.. వ్యాధినిరోధక శక్తి పెంచేలా..
మారిన జీవన విధానం, ఆహారపు అలవాట్లతో ప్రస్తుతం 15 ఏళ్ల లోపు బాలురు పౌష్టికాహారం లోపంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చిన్నపాటి అనారోగ్యాన్ని సైతం తట్టుకోలేకపోతున్నారు. మధ్యవయస్సు, వృద్ధులతో పోల్చితే వ్యాధుల బారి నుంచి పిల్లలు త్వరగా కోలుకోవాలి. కానీ ప్రస్తుత పరిస్థితి దీనికి భిన్నంగా ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని వైద్య, ఆరోగ్యశాఖ విద్యార్థులకు తరచూ పాఠశాలల్లో వైద్యపరీక్షలు నిర్వహిస్తోంది. ఆయా పరీక్షల్లో విద్యార్థులకు రక్తహీనత, ఇతర అనారోగ్య సమస్యలు గుర్తించి తగిన చికిత్సలు అందిస్తున్నది. 10వ తరగతి వార్షిక పరీక్షలు సమీపిస్తున్న సమయంలో విద్యార్థుల మానసిక ఒత్తిడిని అధిగమించేందుకు అవసరమైన కౌన్సిలింగ్తోపాటు వివిధ నైపుణ్యాలపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నది. విద్యార్థుల తక్షణ అనారోగ్య సమస్యలను దూరం చేసేందుకు ఆయుష్ కిట్లు పంపిణీ చేయనున్నది. పరీక్షల సమయంలో వారికి అం టువ్యాధులు, ఇతర వ్యాధులు రాకుండా ఈ మందులు కవచంలా పనిచేయనున్నాయి. ఔషధ కిట్లు జిల్లాకు చేరుకోవడంతో 17 నుంచి పంపిణీకి అధికారులు ఏర్పాట్లు చేశారు.
ఔషధ కిట్ల పంపిణీకి ఏర్పాట్లు పూర్తి
ఖమ్మం జిల్లాలో ప్రభుత్వం ఎంపిక చేసిన 17 పాఠశాలల్లో విద్యార్థులకు ఆయుష్ కిట్లు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేశాం. ఆయా పాఠశాలల్లోని 5,199 మంది విద్యార్థులకు ఈ మందులు పంపిణీ చేయనున్నాం. విద్యార్థుల్లో జ్ఞాపకశక్తి, రోగనిరోధకశక్తి, రక్తహీనత, నులిపురుగుల నివారణకు ఈ మందులు ఉపయోగపడనున్నాయి. విద్యార్థులు వీటిని సద్వినియోగం చేసుకోవాలి.
– కేసీహెచ్ నర్సింహారావు, సీనియర్ మెడికల్ ఆఫీసర్, ఆయుష్ జిల్లా ఇన్చార్జి