Mission Kakatiya | దశాబ్దాలుగా పూడికతో నిండి మరమ్మతుకు నోచుకోని చెరువులు. ఏటా వర్షాలు కురుస్తున్నా నీరు నిలవక.. ఆయకట్టు భూములకు సరిపడా నీరందక పంటలు ఎండిపోయిన పరిస్థితి. ఊరి పక్కనే చెరువులు, కుంటలు ఉన్నా పట్టించుకునే ప్రజాప్రతినిధులు లేక.. అభివృద్ధికి ఆనాటి ప్రభుత్వాలు నిధులు మంజూరు చేయక పెద్ద పెద్ద తటాకాలన్నీ ఎడారులుగా మారి కుంటల స్థాయికి చేరాయి. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిందే తడవుగా సీఎం కేసీఆర్ చెరువులకు పూర్వ వైభవం తెచ్చేందుకు.. నీటి నిల్వ సామర్థ్యం.. భూగర్భ జలాల పెంపునకు 2015లో మిషన్ కాకతీయ పథకాన్ని ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టారు.
ఇల్లెందు నియోజకవర్గవ్యాప్తంగా 410 చెరువుల్లో పూడికతీత, కట్టల ఎత్తు పెంచడంతోపాటు రెండు వైపులా రివిట్మెంట్లు, తూములను రూ.123.53 కోట్లతో మరమ్మతు చేశారు. వర్షాలతో చెరువులు నిండు కుండలను తలపిస్తుండగా.. సమీప బావులు, బోర్లలో భూగర్భ నీటిమట్టం పెరిగి జలసవ్వడి నెలకొంది. ఆయకట్టు రైతులు పంట భూములతోపాటు బీళ్లను సైతం సాగులోకి తెచ్చి రెండు పంటలు పండిస్తూ వ్యవసాయాన్ని పండుగ చేస్తున్నారు. దిగుబడులు పెంచుకుంటూ లాభాలు గడిస్తున్నారు. మిషన్ కాకతీయ పథకం కింద చెరువులను ఇంతగా అభివృద్ధి చేసిన సీఎం కేసీఆర్, తెలంగాణ ప్రభుత్వానికి ఎప్పటికీ రుణపడి ఉంటామని ఆయకట్టు రైతులు చెబుతున్నారు.
– ఇల్లెందు, సెప్టెంబర్ 21
ఇల్లెందు, సెప్టెంబర్ 21: ఇల్లెందు నియోజకవర్గంలోని 410 చెరువులు దశాబ్దాలుగా పూడిపోయిన స్థితిలోనే ఉన్నాయి. రైతులు పంటలకు సాగునీరు అందించలేక ఇబ్బందులు పడ్డారు. అరకొర దిగుబడులు సాధిస్తూ బతుకు బండిని నడపలేక అవస్థలుపడ్డారు. తెలంగాణ వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా ‘మిషన్ కాకతీయ’ పథకాన్ని అమలు చేసి చెరువుల్లో పూడిక తీత పనులు ప్రారంభించారు. చెరువు కట్టలను పటిష్టం చేశారు. దీంతో భూ గర్భజలాలు అమాం తం పెరిగాయి. తూము లు, అలుగులకు మరమ్మతులు పూర్తయి అందుబాటులోకి వచ్చాయి. ఆయకట్టు ఏటికేడు పెరుగుతూ వస్తున్నది. ఇల్లెందు నియోజకవర్గ పరిధిలోని ఐదు మండలాల పరిధిలో (మహబూబాబాద్ జిల్లాలోని గార్ల, బయ్యా రం మండలాలు కలుపుకొని) అధికారులు నాలుగు విడుతల్లో చెరువుల్లో పూడికతీత పనులు, చెరువు కట్టల పునరుద్ధరణ పనులు ప్రారంభించారు. మొదటి దశలో 111 చెరువులు, రెండవ దశలో 132 చెరువులు, మూ డో దశలో 55 చెరువులు, నాలుగో దశలో 38 చెరువులను బాగు చేశారు. ఇలా మొత్తం రూ.123.53 కోట్లు వెచ్చించి 410 చెరువులు, 29 చెక్డ్యాంలు నిర్మించారు.
ఇల్లెందు మండలంలో..
ఇల్లెందు మండలవ్యాప్తంగా 110 చెరువులు ఉండగా అధికారులు నాలుగు విడతల్లో 67 చెరువుల్లో రూ.15.41కోట్లతో పూడిక తీయించారు. ‘మిషన్ కాకతీయ’కు ముందు చెరువుల నీటి నిల్వ సామర్థ్యం 591.94 మిలియన్ క్యూబిక్ ఫీట్ (ఎంసీఎ ఫ్టీ) ఉండగా మిషన్ కాకతీయ తర్వాత నిల్వ సామర్థ్యం 610.25 ఎంసీఎఫ్టీలకు పెరిగింది. నాడు మండలవ్యాప్తంగా ఆయకట్టు 5,562.26 ఎకరాలు ఉండగా ఇప్పుడు 7,946 ఎకరాలకు పెరిగింది. నాడు సగటు భూగర్భజల మట్టం 7.1 మీటర్లు ఉండగా ప్రస్తుతం 2.47 మీటర్లకు చేరుకున్నది. మండలంలో కొత్తగా ఒక చెక్ డ్యాం రూ.1.70 కోట్లతో నిర్మించగా దీని ద్వారా 160 ఎకరాల ఆయకట్టుకు అదనంగా సాగునీరు అందుతున్నది. నాడు పంటల దిగుబడి 12,793.20 టన్నులు కాగా ఇప్పుడు 19,865.40 టన్నులకు పెరిగింది.
టేకులపల్లి మండలంలో..
మండలవ్యాప్తంగా 131 చెరువులు ఉండగా అధికారులు నాలుగు విడతల్లో 70 చెరువులకు రూ.11.13 కోట్లతో పూడికతీత పనులు చేపట్టారు. 2014కు ముందు చెరువుల నీటి నిల్వ సామర్థ్యం 811.7 ఎంసీఎఫ్టీ కాగా మిషన్ కాకతీయ తర్వాత నిల్వ సామర్థ్యం 832.4 ఎంసీఎఫ్టీలకు పెరిగింది. నాటి చెరువుల కింద ఆయకట్టు 6,494 ఎకరాలు కాగా ఇప్పుడు ఆయకట్టు 9398 ఎకరాలకు పెరిగింది. నాడు సగటు భూగర్భ జలాల మట్టం 7.1 మీటర్లు ఇప్పుడు 2.47 మీటర్లకు చేరుకున్నది. మండలంలో కొత్తగా రూ.18.50 కోట్లతో 20 చెక్డ్యాంలు నిర్మించగా అదనంగా 624 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుతున్నది. నాడు ఆయకట్టు నుంచి ఏడాదికి పంటల దిగబడి 14,936 టన్నులు కాగా ప్రస్తుతం దిగుబడి 23,495 టన్నులకు పెరిగింది.
కామేపల్లి మండలంలో..
మండల పరిధిలో మొత్తం 102 చెరువులున్నాయి. నాలుగు దశల్లో అధికారులు 64 చెరువులను రూ.19.85 కోట్ల ఖర్చుతో పూడిక తీయించారు. 2014కు ముందు చెరువుల నీటి నిల్వ సామర్థ్యం 206.92 ఎంసీఎఫ్టీ ఉండగా విషన్ కాకతీయ తర్వాత చెరువుల నీటి నిల్వ సామర్థ్యం 362.02 ఎంసీఎఫ్టీలకు పెరిగింది. 2014కు ముందు ఆయకట్టు 6,684 ఎకరాలు ఉండగా ప్రస్తుత ఆయకట్టు 8,912 ఎకరాలకు పెరిగింది. నాడు సగటు భూగర్భ జల మట్టం 7.17 మీటర్లు ఉండగా మిషన్ కాకతీయ తర్వాత కేవలం 3.75 మీటర్లకు చేరింది. మండలవ్యాప్తంగా రెండు చెక్ డ్యాంలు అందుబాటులోకి వచ్చాయి. చెక్డ్యాంల ద్వారా 280 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు పుష్కలం.
పూడికతీతతో జలాలు..
నాయకులగూడెం చెరువుకింద మాకు మూడెకరాల భూమి ఉంది. గతంలో పొలానికి నీరు అందక మంచి దిగుబడి ఉండేది కాదు. ఆయకట్టు కేవలం 40 ఎకరాలు ఉండేది. తెలంగాణ వచ్చినంక సీఎం కేసీఆర్ ‘మిషన్ కాకతీయ’ అమలు చేసి చెరువుల్లో పూడిక తీయించారు. తర్వాత భూగర్భజలాలు అమాంతం పెరిగా యి. ఇప్పుడు ఆయకట్టు 80 ఎకరాలు పెరిగింది. సాగుకు మాకెలాంటి ఇబ్బందులు లేవు. సాగు సాఫీగా సాగుతున్నది.
– మందా రమేశ్, రైతు, నాయకులగూడెం, ఇల్లెందు మండలం
బోర్ల ద్వారా వ్యవసాయం
మాకు నర్సింహుల కుంట కింద రెండెకరాల భూమి ఉంది. స్వరాష్ట్రం వచ్చిన తర్వాత కుంటలో పూడికతీత పనులు జరిగాయి. ఆ తర్వాత భూగర్భజలాలు పెరిగాయి. తర్వాత పొలంలో బోరు వేయించాం. ప్రభుత్వం ఉచిత కరెంటు కూడా ఇస్తుండడంతో దర్జాగా వ్యవసాయం చేసుకుంటున్నాం. మా పొలం చుట్టుపక్కల రైతులు సుమారు 20 బోర్లు వేశారు. భూగర్భ జలాలు పెరిగాయి. ప్రభుత్వానికి రుణపడి ఉంటాం.
– చీమల పద్మ, రైతు, నాయకులగూడెం, ఇల్లెందు మండలం
పంటల దిగుబడి పెరిగింది..
నా చిన్నతనం నుంచి చూస్తున్న. మా గ్రామ సమీపంలోని సాయమ్మ చెరువు పూడిపోయి ఉండేది. సాగునీరు లేకపోవడంతో చెరువు కింద భూములు పడావుగా ఉండేవి. తెలంగాణ వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ మిషన్ భగీరథ అమలు చేసి చెరువుల్లో పూడిక తీయించారు. చెరువు కట్టలను పటిష్టం చేశారు. దీంతో చెరువుల్లో నీరు నిల్వ ఉంటున్నది. భూగర్భజలాలు పెరగడంతో మేం బోర్ల ద్వారా సాగు చేసుకుంటున్నాం. పంటల దిగుబడి గతంలో కంటే పెరిగింది.
– మాలోత్ పూల్సింగ్, రైతు, కొత్తతండా, టేకులపల్లి మండలం
చెరువులకు పూర్వ వైభవం..
తెలంగాణ ఏర్పడక ముందు చెరువుల్లో పూడిక చేరి ఉండేది. పంట భూములు నెర్రెలువారి బంజర భూములుగా దర్శనమిచ్చేవి. రాష్ట్రం వచ్చినంక ముఖ్యమంత్రి కేసీఆర్ మిషన్ కాకతీయ పథకం అమలు చేసి చెరువులను బాగుచేశారు. తూములు, అలుగులు, చెరువు కట్టలను పటిష్టం చేశారు. వాగులు, నదులపై కొత్తగా చెక్ డ్యాంలను నిర్మించారు. దీంతో ఆయకట్టు మరింత పెరిగింది. భూగర్భ జలాలు ఉబికి వచ్చాయి. రైతులు నిశ్చింతగా బోర్ల ద్వారా వ్యవసాయం చేస్తున్నారు.
– బానోత్ హరిప్రియ, ఇల్లెందు ఎమ్మెల్యే