దుమ్ముగూడెం, ఏప్రిల్ 3 : నీటితో నిత్యం కళకళలాడే గోదావరి ఎడారిని తలపిస్తోంది. గత కేసీఆర్ ప్రభుత్వ హయాం లో నిత్యం జలకళను సంతరించుకోగా.. ప్రస్తుతం నీరు లేక బోసిపోయి దర్శనమిస్తోంది. గోదావరిలో ఎక్కడో ఉన్న పాయలో ఉన్న నీటికి మోటర్లు పెట్టుకొని యాసంగి సాగు చేసిన రైతులు పంటలకు నీరు పారించుకోవాల్సి వస్తోంది. దుమ్ముగూడెం వద్ద బ్రిటీష్ కాలంలో నిర్మించిన ఆనకట్ట వద్ద పలుచోట్ల లీకేజీలతో గోదావరి నుంచి ప్రవహించే నీరంతా కిందకు వెళ్తోం ది. దీంతో ఎగువ ప్రాంతాలైన దుమ్ముగూడెం, చర్ల మండలాల్లో సుమారు వెయ్యి ఎకరాల ఆయకట్టు కింద రైతులు సాగు చేసిన పంటలకు నీరందక ఎండిపోయే పరిస్థితి ఏర్పడింది. ప్రగళ్లపల్లి లిఫ్ట్కు నాలుగు మోటర్లు ఉండగా.. నీరందకపోవడంతో జేసీబీతో గోదావరి నదిలో కాలువ తీసినప్పటికీ సాగునీరు అందడం లేదని అన్నదాతలు దిగులు చెందుతున్నారు. సుమారు 100 ఏళ్ల క్రితం నుంచి గోదావరిలో నీరు లేకపోవడమనే మాట లేదని అప్పటి పెద్దలు చెబుతున్నారు. ఇదే విధానం కొనసాగితే గోదావరి పరీవాహక గ్రామాల్లోని రైతన్నలకు, దుమ్ముగూడెం, చర్ల మండలాలకు చెందిన సుమారు వెయ్యి ఎకరాల ఆయకట్టుతోపాటు 1,500 మంది రైతుల సాగు పరిస్థితి ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉన్నదని అన్నదాతలు వాపోతున్నారు.
లక్షలాది రూపాయల పెట్టుబడులు పెట్టి వ్యవసాయం చేస్తున్న తమకు గోదావరి నీరే ఆధారమని.. ఆ నీటితోనే ఏటా పంటలు పండించుకుంటున్నామని, ప్రస్తుతం గోదావరిలో నీరు లేక ఎడారిగా మారుతుండడంతో ఆత్మహత్యలే శరణ్యమని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. గోదావరి నీటితో రైతులు పంటలు సాగు చేస్తుండగా.. మరోపక్క ఎగువన ఉన్న ఈ రెండు మండలాల మధ్యలో పర్ణశాల వద్ద మిషన్ భగీరథ పంపుహౌస్, ట్యాంక్ నిర్మించగా.. గోదావరిలో నీరు వాటికి అందకుండా పోయే పరిస్థితి ఉంది. దీంతో రైతుల పంటలకు సాగునీరు లేక.. ఏజెన్సీవాసులకు మంచినీరు అందక తండ్లాడే పరిస్థితి ఉన్నదని పలువురు వాపోతున్నారు. దీనిపై వివిధ శాఖల అధికారులు స్పందించి దుమ్ముగూడెం ఆనకట్ట వద్ద ఉన్న లీకేజీలకు మరమ్మతులు చేపట్టి.. ఎగువ నుంచి వస్తున్న నీటిని నిల్వ చేసేలా చర్యలు చేపట్టాలని ఆయకట్టు రైతులతోపాటు మండల ప్రజలు కోరుతున్నారు.
ఆరెకరాల్లో వరి సాగు చేశా. ప్రస్తుతం పంట పొట్ట దశలో ఉంది. గోదావరిలో ఆనకట్ట వద్ద లీకేజీల వల్ల దిగువకు నీరు పారుతుండడంతో ప్రగళ్లపల్లి లిఫ్ట్ వద్ద సాగు చేసిన తమ పంటలకు సాగునీరు అందడం లేదు. మరో రెండు, మూడు రోజులు ఇలానే ఉంటే పంట ఎండిపోయే పరిస్థితి ఉంది. సుమారు రూ.4 లక్షల వరకు పెట్టుబడి పెట్టా. తెచ్చిన అప్పు ఎలా తీర్చాలో అర్థం కావట్లేదు.
సున్నంబట్టిలో నాకున్న మూడెకరాల్లో వరి సాగు చేశా. రెండు తడులు ఉంటే పంట చేతికొస్తుంది. మోటర్లు ఉన్నా ఉపయోగం లేకుండా పోయింది. మోటరుకు గోదావరిలో నీరు అందడం లేదు. ఇదే పరిస్థితి వారం కొనసాగితే రైతులు ఒకపక్క.. తాగునీరు అందక ప్రజలు మరోపక్క ఇబ్బంది పడాల్సిందే. గోదావరిలో ఆనకట్టకు వెంటనే మరమ్మతులు చేపట్టాలని వేడుకుంటున్నా.