ఎర్రుపాలెం:రానున్నయాసంగిలో వరికి బదులు రైతులు ఆరుతడి పంటలను సాగు చేసుకోవాలని జిల్లా వ్యవసాయ విస్తరణ అధికారిని ఎం.విజయనిర్మల సూచించారు. సోమవారం మండల పరిధిలోని ఇనగాలి గ్రామంలో వ్యవసాయ సహాయ సంచాలకులు కొంగర వెంకటేశ్వరరావుతో కలిసి యాసంగి పంటపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భారతీయ ఆహార సంస్థ(ఎఫ్సీఐ) యాసంగిలో పండించే వడ్లను కొనుగోలు చేయట్లేదు కాబట్టి ఈ సంవత్సరం కొనుగోలు కేంద్రాలు ఉండవని, రైతులందరూ ఆరుతడి పంటలు వేయాలన్నారు. సాధారణంగా వానాకాలం వరికోత అనంతరం మినుము పంట సాగు తగు సత్ఫలితాలు ఇస్తుందని అన్నారు.
నవంబర్ 15 నుంచి డిసెంబర్ 15 వరకు మాగాణి భూముల్లో మినుమును సాగుచేసుకోవచ్చని తెలిపారు. సమగ్ర యాజమాన్య పద్ధతుల ద్వారా ఎకరాకు 4 నుంచి 8 క్వింటాళ్ల దిగుబడి సాధించవచ్చన్నారు. పెసర పంట తేమను పట్టి ఉంచే అన్ని రకాల నేలల్లో అనుకూలంగా ఉంటుందని, నవంబర్ 15 నుంచి డిసెంబర్ 15 వరకు సాగుకు అనుకూలమని తెలిపారు. శెనగ బరువైన నల్లరేగడి భూముల్లో మంచి దిగుబడులు వస్తాయన్నారు.
వేరుశెనగ యాసంగిలో అధిక విస్తీర్ణంలో సాగు చేసే ఆరుతడి పంటల్లో ఒకటని, ఎర్రచల్కా నెలల్లో అత్యంత అనుకూలంగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయాధికారి కొండూరి విజయభాస్కర్రెడ్డి, ఏఈవో బాలకృష్ణ, జిస్ణు, గ్రామసర్పంచ్ యరమల వెంకెటరెడ్డి, సొసైటీ అధ్యక్షుడు మదన్మోహన్రెడ్డి, ఎంపీటీసీ పొట్టపింజర నరసింహయ్య, మార్కెట్ కమిటీ డైరెక్టర్ పొట్టపింజర చిట్టిబాబు, గ్రామ రైతుబంధు సమితి అధ్యక్షుడు రత్నారెడ్డి, రైతులు పాల్గొన్నారు.