చింతకాని: రైతాంగం వరి మినహా మిగిలిన ఇతర పంటలపై దృష్టి సారించాలని, తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు సాధించాలని జిల్లా వ్యవసాయాధికారిణి విజయనిర్మల తెలిపారు. మండల పరిధిలో చిన్నమండవ గ్రామపంచాయతీ కార్యాలయంలో శుక్రవారం రైతులకు ప్రత్యామ్న్యాయ పంటలపై జరిగిన అవగాహన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం సూచించిన పంటలనే రైతులు వేసి అధిక లాభాలు గడించాలని, రానున్న రోజుల్లో పప్పుధాన్యాలకు అధిక గిరాకీ ఉంటుందని చెప్పారు. యాసంగి వరిని కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా కోనబోదని, వరి వేసి ఆర్థికంగా రైతులు నష్టపోవద్దని సూచించారు.
గ్రామంలో పలు పంట పోలాలు పరిశీలించిన ఆమె పంటల్లో పెట్టుబడి ఖర్చులు తగ్గించుకొనే విధానాలు, తెగుళ్ళు వచ్చే సమయంలో నత్రజని ఎరువుల వాడకాన్ని తగ్గించాలని రైతులకు సూచించారు. అనంతరం నియంత్రిత పంటల సాగుపై విడుదల చేసిన బ్రోచర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఏడీఏలు కోంగర వెంకటేశ్వరరావు, బీ. సరిత, ఏవో పల్లెల నాగయ్య, ఏఈవో హరికృష్ణ, సర్పంచ్ కాశిమల వెంకట్రావమ్మ, ఉపసర్పంచ్ పర్చగాని వీరబాబు, రైతుబంధుసభ్యులు, రైతులు పాల్గొన్నారు.