అశ్వారావుపేట, ఆగస్టు 8: వచ్చే సాధారణ ఎన్నికలకు కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాలు సిద్ధమవుతున్నాయి. గతంలో కంటే ఈసారి పోలింగ్ శాతాన్ని పెంచేందుకు ఏర్పాట్లను వేగవంతం చేశాయి. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు, వీవీ ప్యాట్స్పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రచారం విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నాయి. దీనిలో భాగంగా ప్రతి నియోజకవర్గంలో ప్రచార నిర్వహణకు ఒక మొబైల్ వాహనాన్ని కేటాయించింది. మరోవైపు ఓటు సమగ్ర జాబితా రూపొందించే ప్రక్రియను చేపడుతున్నాయి. కొత్తగా ఓటు హక్కు పొందిన వారికి బీఎల్వోలు ఈవీఎం, వీవీ ప్యాట్స్ ద్వారా ఓటు హక్కు వినియోగంపై అవగాహన కల్పిస్తున్నారు. ప్రజల కోసం మాక్ పోలింగ్ నిర్వహించనున్నారు.
జిల్లావ్యాప్తంగా 1,092 పోలింగ్ కేంద్రాలు..
అశ్వారావుపేట నియోజకవర్గంలో 184 పోలీంగ్ కేంద్రాలు, కొత్తగూడెంలో 252, భద్రాచలం 174, ఇల్లందు 241, పినపాక నియోజకవర్గంలో 241 చొప్పున.. జిల్లావ్యాప్తంగా 1,092 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. భద్రాద్రి జిల్లావ్యాప్తంగా జనవరి 5 నాటికి జిల్లావ్యాప్తంగా 9,14,245 మంది ఓటర్లు ఉండగా వీరిలో పురుషులు 4,46,797, మహిళలు 4,67,414, ఇతరులు 34 మంది ఉన్నారు. 2018 ఎన్నికలతో పోలిస్తే ఈసారి ఎన్నికల్లో భారీగా ఓట్లు పోలయ్యే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. గతంలో కంటే ఇప్పుడు కొత్తగా 48,357 మంది ఓటు హక్కు పొందారు. కొత్తగా ఓట్లు నమోదు, జాబితాలో చేర్పులు, మార్పుల ప్రక్రియ పూర్తయిన తర్వాత ఓటర్ల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నది. గత సాధారణ ఎన్నికల్లో 8,65,888 ఓట్లు పోల్ అయ్యాయి.
ఓటు వినియోగంపై అవగాహన కల్పిస్తున్నాం..
ప్రజాస్వామ్యంలో ఓటుకు అత్యంత ప్రాధాన్యత ఉంది. కొత్తగా ఓటు హక్కునమోదు చేసుకున్న వారికి ఓటు విలువపై అవగాహన కల్పిస్తున్నాం. విస్తృతంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. తద్వారా రానున్న ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెరుగుతుందని భావిస్తున్నాం. ఈవీఎం, వీవీ ప్యాట్స్ ప్రాధాన్యతపై గ్రామాల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నాం.
– పర్సా రాంబాబు, అదనపు కలెక్టర్, కొత్తగూడెం