మామిళ్లగూడెం/ కొత్తగూడెం ఎడ్యుకేషన్/ పాల్వంచ/ పాల్వంచ రూరల్, జూలై 1 : అభ్యర్థులు నెలల పాటు పుస్తకాలతో కుస్తీ పట్టారు. గ్రంథాలయాలు, శిక్షణ కేంద్రాలు, ఇళ్లకే పరిమితమయ్యారు. కొలువే లక్ష్యమంటూ ప్రతినబూని చదివారు. ఇన్నాళ్లు మెదళ్లలో నిక్షిప్తం చేసుకున్న పుస్తక గంధాన్ని పేపర్పై పెట్టారు. రాసిన వారంతా కొలువు తమదేనన్న దీమాతో ఉన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లావ్యాప్తంగా గ్రూప్-4 పరీక్ష శనివారం ప్రశాంత వాతావరణంలో జరిగింది. రెండు సెషన్లలో నిర్వహించిన పరీక్షకు అభ్యర్థులు నిర్దేశించిన సమయం కంటే గంట ముందుగానే కేంద్రాలకు చేరుకున్నారు. అభ్యర్థులను పూర్తిస్థాయిలో తనిఖీ చేసిన తర్వాతే కేంద్రాల్లోకి అనుమతించారు. పరీక్ష కేంద్రాల వద్ద పోలీసులు గట్టి బందోబస్తు చేపట్టారు. పలు కేంద్రాలను కలెక్టర్లు, సీపీ, ఎస్పీలు సందర్శించారు.
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) శనివారం నిర్వహించిన గ్రూప్-4 పరీక్షలు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రశాంతంగా జరిగాయి. ఖమ్మం జిల్లాలో 163 పరీక్షా కేంద్రాల్లో 49,774 అభ్యర్థులు పరీక్షలు రాయాల్సి ఉండగా ఉదయం మొదటి సెషన్కు 40170 (80.70%), మధ్యాహ్నాం రెండో సెషన్కు 39968 (80.30%) మంది అభ్యర్థులు హాజరైనట్లు కలెక్టర్ వీపీ గౌతమ్ తెలిపారు. కేంద్రాల్లోని అన్ని హాళ్లనూ సీసీ కెమెరాలతో పర్యవేక్షించినట్లు చెప్పారు. ప్రత్యేకంగా ఐడీవోసీ నుంచి ప్రతి పరీక్షా కేంద్రంపైనా నిఘా ఉంచినట్లు తెలిపారు. 33 రూట్లలో 66 మంది రూట్ ఆఫీసర్లను, ప్రతి సెంటర్కి గెజిటెడ్ స్థాయి అధికారిని లైజన్ అధికారిగా నియమించామని వివరించారు. సత్తుపల్లి, మధిర, బోనకల్లు వంటి గ్రామీణ మండలాల్లోనూ పరీక్షలు ప్రశాంతంగా జరిగినట్లు తెలిపారు.
కేంద్రాల తనిఖీ..
ఐడీవోసీలోని స్ట్రాంగ్రూమ్ నుంచి ప్రశ్న పత్రాలు, సామగ్రి పరీక్షా కేంద్రాలకు తరలింపు ప్రక్రియను కలెక్టర్ పర్యవేక్షించారు. మొదటి సెషన్లో కేంద్రాలను సందర్శించి పరీక్షల సరళిని క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారు. కొణిజర్ల మండలం అమ్మపాలెంలోని బ్రౌన్స్ ఫార్మసీ కళాశాల, విజయ ఇంజినీరింగ్ కళాశాల, తనికెళ్లలోని జడ్పీ హైస్కూళ్లలోని పరీక్ష కేంద్రాలను సందర్శించి పరీక్ష నిర్వహణ తీరు తెన్నులను పరిశీలించారు. ఖమ్మంలోని రిక్కాబజార్ సూల్, ఎస్ఆర్అండ్బీజీఎన్ఆర్ పరీక్ష కేంద్రాలను సీపీ విష్ణు సందర్శించి బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించారు.
భద్రాద్రి జిల్లాలో..
భద్రాద్రి జిల్లాలో మొత్తం 77 కేంద్రాల్లో అభ్యర్థులు పరీక్షలు రాశారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 26,910 మంది అభ్యర్థులకు హాల్ టిక్కెట్లు జారీ అయ్యాయి. ఉదయం పరీక్షకు 21,582 మంది హాజరుకాగా 5328 మంది గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం పరీక్షకు 21,716 మంది హాజరుకాగా 5194 మంది గైర్హాజరయ్యారు. అభ్యర్థులు గంట ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు. కొత్తగూడెంలో ఏడుగురు అభ్యర్థులు ఆలస్యంగా రావడంతో సిబ్బంది వారిని అనుమతించలేదు. ఇందులో ఐటీ కార్డులు తెచ్చుకోకపోవడం, హాల్టికెట్లో ఉన్న వివరాలు, ఐడీ ప్రూఫ్లో ఉన్న వివరాలు సరిపోకపోవడం వంటి కారణాలతో మరో ముగ్గురిని సిబ్బంది అనుమతించలేదు. 77 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 77 మంది లైజన్ అధికారులు, 36 మంది రూట్ ఆఫీసర్లు విధులు నిర్వహించారు. ఎస్పీ వినీత్ కూడా పలు పరీక్షా కేంద్రాలను సందర్శించి బందోబస్తు పర్యవేక్షించారు.
ఔదార్యం చాటిన పోలీసులు..
గ్రూప్-4 పరీక్షలు రాసేందుకు వచ్చిన అభ్యర్థులకు అండగా నిలిచి ఔదార్యం చాటారు ఉమ్మడి జిల్లా పోలీసులు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన కొందరు అభ్యర్థులు తమ పరీక్ష కేంద్రాలు తెలియక గందరగోళానికి గురవడంతో వారిని తమ వాహనాల్లో పరీక్ష కేంద్రాలకు తరలించారు. చుంచుపల్లి మండలంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్దకు దారి తెలియక వచ్చిన ఓ అభ్యర్థినిని చుంచుపల్లి ఎస్సై సుమన్ తన వాహనంలో ఎక్కించుకొని కూలీలైన్ పాఠశాలలోని కేంద్రానికి సకాలంలో చేర్చారు. వెంకటలక్ష్మి అనే అభ్యర్థిని హాల్టికెట్లో సాంకేతిక లోపాలు ఉండడంతో ఆమెను పరీక్ష కేంద్రంలోకి అనుమతించలేదు. హాల్టికెట్పై గెజిటెడ్ ఆఫీసర్ సైన్ కావాలని అధికారులు చెప్పడంతో ఆమె అధికారుల సంతకం కోసం వెతుక్కుంటూ జూనియర్ కళాశాల వద్దకు చేరుకుంది. సమయం మించిపోతుండడంతో కంటతడి పెట్టింది. ఈ క్రమంలో అక్కడే విధులు నిర్వర్తిస్తున్న ఆర్ఐ (వెల్ఫేర్) ప్రగడ కామరాజు గమనించి ఔదర్యాన్ని చాటారు. సదరు అభ్యర్థిని వెంటనే తన వాహనంలో ఎక్కించుకొని తన కార్యాలయానికి తీసుకెళ్లి ధ్రువపత్రాలను పరిశీలించి సంతకం చేశారు. తిరిగి సకాలంలో పరీక్ష కేంద్రానికి చేర్చారు. ఖమ్మంలో ట్రాఫిక్ సీఐ అంజలి కూడా ఓ చంటిపాపను లాలించారు. గార్ల మండలానికి చెందిన గాంధీ, ఉషారాణి దంపతులు తమ 6 నెలల చిన్నారిని తీసుకొని ఖమ్మం నగరంలోని ఎస్ఆర్బీజీఎన్ఆర్ కళాశాల వద్దకు వచ్చారు. వారిద్దరూ పరీక్షకు వెళ్లాల్సి ఉంది. చిన్నారి అమ్మమ్మ, తాతయ్య మరో ఊరు నుంచి రావాల్సి ఉండగా బస్సు ఆలస్యమైంది. అప్పటికే చిన్నారి తల్లిదండ్రుల పరీక్ష సమయం సమీపించింది. వారి కంగారును గమనించిన సీఐ అంజలి.. ఆ చిన్నారిని తీసుకొని లాలించింది. అమ్మమ్మ, తాతయ్య రాగానే వారికి అప్పగించింది.