వాహన ప్రేమికులు అబ్బురపడేలా ‘నమస్తే తెలంగాణ’, తెలంగాణ టుడే’ ఖమ్మం నగరంలో ఆటో ఎక్స్పో షో నిర్వహించాయని, ఆయా మీడియా సంస్థల చేసిన కృషి అభినందనీయమని ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ అన్నారు. ఖమ్మం నగరంలో రెండో రోజు ఆదివారం నిర్వహించిన షో ముగింపు సభలో ఆయన మాట్లాడారు. అనేక దిగ్గజ కంపెనీలన్నింటినీ ఒకే వేదికపైకి తీసుకురావాలనే ఆలోచన గొప్పదన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా కంపెనీలు స్టాళ్లు ఏర్పాటు చేశాయని కొనియాడారు. ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో ప్రతిఒక్కరికీ వాహనం అవసరమైందన్నారు. నాలుగు షోరూంలు చూసి, ఐదారు వాహనాలు చూసే అవసరం లేకుండానే ‘నమస్తే తెలంగాణ’ షో ఏర్పాటు చేసిందన్నారు.
వినియోగదారులు అన్ని స్టాళ్లు సందర్శించి తమకు నచ్చిన వాహనాలను కొనుగోలు చేశారన్నారు. టెస్ట్ డ్రైవ్ చేసి మరీ కొనుగోలు చేసే అవకాశం కల్పించినందుకు యాజమాన్యాలను అభినందించారు. బ్యాంకర్లు వినియోగదారుల సందేహాలను నివృత్తి చేసి, తక్కువ వడ్డీ రేట్లకు రుణసదుపాయం కల్పించడం మంచి విషయమన్నారు. ఒకవైపు తెలంగాణ ప్రజల ప్రయోజనాలను కాపాడడంలో ముఖ్యభూమిక పోషిస్తున్న ‘నమస్తే తెలంగాణ’ మరోవైపు ఆటో ఎక్స్పో షో వంటి ప్రదర్శనలు నిర్వహించడం అభినందనీయమన్నారు.