సారపాక, ఏప్రిల్ 20: అరవై లక్షల సభ్యత్వాలతో బీఆర్ఎస్ పార్టీ బలమైన శక్తిగా ఆవిర్భవించిందని ప్రభుత్వ విప్, బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో విజయం మనదేనంటూ స్పష్టం చేశారు. మణుగూరు పట్టణంలోని 1 నుంచి 10 వార్డుల బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం పట్టణంలోని విజయనగరం (తిర్లాపురం) సమ్మక్క, సారలమ్మ గుడి సమీపంలో గురువారం జరిగింది. పార్టీ పట్టణ అధ్యక్షుడు అడపా అప్పారావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ సమ్మేళనానికి ముఖ్యఅతిథిగా హాజరైన రేగా.. తొలుత బీఆర్ఎస్ జెండాను ఆవిష్కరించారు. అనంతరం బీఆర్ఎస్ నాయకుడు బోశెట్టి రవి సీఎం సందేశాన్ని వినిపించారు. అనంతరం రేగా మాట్లాడుతూ.. తెలంగాణ వచ్చాక జరిగిన అభివృద్ధి ఏమిటో, ప్రత్యేక తెలంగాణకు ముందు రాష్ట్రం ఎలా ఉండేదో ప్రజలు బేరీజు గమనిస్తూనే ఉన్నారని అన్నారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ అనేక పథకాలు అమలు చేస్తున్నారని అన్నారు.
అభివృద్ధిలో రాష్ర్టాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దారని అన్నారు. ఒక్కో నియోజకవర్గంలో 50 వేల సభ్యత్వాలను కలిగి ఉన్న బీఆర్ఎస్.. ఎంతో బలమైన శక్తిగా ఉన్నట్లు చెప్పారు. రానున్న ఎన్నికల్లో ముచ్చటగా మూడోసారీ కూడా బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశారు. ఈ క్రమంలో పార్టీని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు కలిసి ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని పలుపునిచ్చారు. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో మతపిచ్చిగాళ్లు ప్రజలను మోసం చేసేందుకు వస్తున్నారని విమర్శించారు. ప్రజలు, కార్యకర్తలు వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని ఓర్వలేకనే కొందరు ప్రతిపక్ష నాయకులు ప్రజలకు మాయమాటలు చెబుతున్నారని విమర్శించారు. ప్రధాని మోదీ కూడా దేశసంపదను కార్పొరేట్లకు దోచిపెడుతున్నారని విమర్శించారు. ఆత్మీయ సమ్మేళనాలతో నాయకులు, ప్రజలు మమేకమై పార్టీకి అండగా నిలుస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలపై గ్రామాల్లోనూ విస్తృత చర్చ జరగాలని ఆకాంక్షించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో మణుగూరు పట్టణంలో ఎంతటి అభివృద్ధి జరిగిందో తెలియజేస్తూ ముద్రించిన కరపత్రాలను సమ్మేళనంలో ప్రభుత్వ విప్ ప్రదర్శించారు. ఈ ఆత్మీయ సమ్మేళనంలో బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు పోశం నర్సింహారావు, ముత్యం బాబు, అడపా బాబు, కుర్రి నాగేశ్వరరావు, కోలేటి భవానీశంకర్, అన్వర్పాషా, ఎన్ఎన్ రాజు, ఊకంటి ప్రభాకర్రావు, పొనుగోటి భద్రయ్య, అక్కిరెడ్డి సంజీవరెడ్డి, దొడ్డా శ్రీనివాసరెడ్డి, కత్తి రాములు, చంద్రకళ, బోశెట్టి నవీన్, తాళ్లపల్లి యాదగిరిగౌడ్, హర్షనాయుడు, వట్టం రాంబాబు, జావేద్పాషా, సురేంద్ర పటేల్, మట్టపల్లి సాగర్ తదితరులు పాల్గొన్నారు.