ఖమ్మం, ఫిబ్రవరి 6 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఖమ్మం జిల్లా కేంద్రంలోని జర్నలిస్టులకు ఈ నెల 10న ఇళ్ల స్థలాలు పంపిణీ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ తెలిపారు. ఖమ్మం ఐడీవోసీ సమావేశ మందిరంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కలెక్టర్ వీపీ గౌతమ్, సీపీ విష్ణుతో కలిసి ఆయన మాట్లాడారు. గత నెల 18న ఖమ్మం బహిరంగ సభలో సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు, మంత్రి హరీశ్రావు ఆదేశాల మేరకు హైదరాబాద్ నుంచి సోమవారం నేరుగా నూతన కలెక్టరేట్కు చేరుకున్న తాను.. కలెక్టర్ సహా ఇతర రెవెన్యూ అధికారులతో ప్రత్యేకంగా సమావేశమై జర్నలిస్టుల ఇళ్ల స్థలాల పంపిణీపై సమీక్షించినట్లు చెప్పారు. ఇప్పటికే స్థలం గుర్తించామని, ప్రతి జర్నలిస్టుకూ 200 గజాలు ఇవ్వనున్నామని తెలిపారు. ఖమ్మం జిల్లా కేంద్రంలో పని చేసే జర్నలిస్టులు, ఫొటోగ్రాఫర్లు, టౌన్ రిపోర్టర్లు, కెమెరామెన్లందరికీ ఇళ ్లస్థలాలు పంపిణీ చేస్తామన్నారు.
ఒకవేళ ఈ నెల 10న మంత్రి హరీశ్రావు అసెంబ్లీలో వైద్య బడ్జెట్ పద్దుపై ప్రసంగించే అవకాశం ఉంటే ఆ రోజు ఖమ్మానికి రాని పక్షంలో అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత వస్తారన్నారు. 13 లేదా 14 తేదీల్లో ప్రత్యేకంగా ఇదే కార్యక్రమం కోసం వచ్చి పట్టాలు పంపిణీ చేసి వెళ్తారని అన్నారు. అదేవిధంగా రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కూడా ఈ నెల 10న ఖమ్మంలో పర్యటించే అవకాశం ఉందని తెలిపారు. వీడీవోస్ కాలనీలో నూతనంగా నిర్మిస్తున్న వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ను, గోళ్లపాడు కాలువపై పార్కులు, బస్తీ దవాఖానలు, యోగా సెంటర్లను ప్రారంభిస్తారని వివరించారు. అలాగే మరో రూ.32 కోట్లతో నగరంలో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకూ ఆయన శంకుస్థాపన చేస్తారని చెప్పారు. కేఎంసీ మేయర్ నీరజ, కమిషనర్ ఆదర్శ్ సురభి, సుడా ఛైర్మన్ విజయ్ కుమార్, అదనపు కలెక్టర్లు స్నేహలత మొగిలి, ఎన్.మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు.