12వ తేదీన పరీక్షకు ఫ్లయింగ్ స్కాడ్స్గా జిల్లా అధికారులు
పేపర్-1కి 18,514, పేపర్-2కి 15,004 మంది
పేపర్-1కి 78, పేపర్-2కి 64 కేంద్రాలు
హాజరుకానున్న 33,518 మంది అభ్యర్థులు
పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
ఖమ్మం ఎడ్యుకేషన్, జూన్ 9: ఈ నెల 12న జరుగనున్న ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నిర్వహణకు విద్యాశాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ మేరకు చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ ఆఫీసర్లతో ఇప్పటికే కలెక్టర్ సమావేశమై దిశానిర్దేశం చేశారు. పరీక్ష కేంద్రాల ఏర్పాటు, రూట్ ఆఫీసర్లు, పరీక్ష నిర్వహణపై సూచనలు చేశారు. పరీక్ష నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించొద్దని స్పష్టం చేశారు. పరీక్షలు రాసే అభ్యర్థులకు ఇబ్బందులు ఎదురుకాకుండా కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు కల్పించేలా విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకున్నారు.
33,518 మంది అభ్యర్థులు..
టెట్ పేపర్-1, 2లకు 33,518 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. ప్రశ్నపత్రాలకు డీఆర్వోను జాయింట్ కస్టోడియన్గా నియమించారు. పేపర్-1 పరీక్షను ఉదయం, పేపర్-2 పరీక్షను మధ్యాహ్నం నిర్వహించనున్నారు. పేపర్-1ను డీఈడీ అభ్యర్థులు, పేపర్-2 బీఈడీ అభ్యర్థులు రాయనున్నారు. టెట్ ఉత్తీర్ణులైతే డీఈడీ అభ్యర్థులు ఎస్జీటీ పోస్టులకు, బీఈడీ అభ్యర్థులు స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు అర్హత సాధిస్తారు. పేపర్-1ను 78 కేంద్రాల్లో 18,514 మంది, పేపర్-2ను 64 కేంద్రాల్లో 15,004 విద్యార్థులు రాయనున్నారు. మొత్తం 142 కేంద్రాల్లో ఈ పరీక్షలు జరుగనున్నాయి. పేపర్-1 ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, పేపర్-2 మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగనుంది.
ఫ్లయింగ్ స్కాడ్స్గా జిల్లా అధికారులు..
టెట్కు 11 రూట్లలో ఫ్లయింగ్ స్కాడ్స్ను నియమించారు. విద్యాశాఖలోని ఎంఈవోలతోపాటు జిల్లా అధికారులను ఫ్లయింగ్ స్కాడ్స్గా నియమిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఫ్లయింగ్ స్కాడ్స్లో జిల్లా అధికారులు వయోజన విద్య డీడీ ధన్రాజు, బీసీ వెల్ఫేర్ అధికారి జ్యోతి, ఆడిట్ అధికారి గోవిందరెడ్డి, సీపీవో శ్రీనివాస్, సివిల్ సప్లయి అధికారి రాజేందర్, డీసీవో విజయకుమారి, హార్టికల్చర్ అధికారి అనసూయ, డీఆర్డీవో విద్యాచందన, ఏడీ మైన్స్ సంజయ్కుమార్, పీఆర్ ఈఈ చంద్రమౌళి, ఫిషరీస్ అధికారి ఆంజనేయస్వామి ఉన్నారు.
పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్..
టెట్ నిర్వహణకు అధికారులు, సిబ్బందిని పూర్తి స్థాయిలో నియమించారు. పరీక్ష కేంద్రాలకు చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ ఆఫీసర్లు, సెంట్రల్ లెవల్ అబ్జర్వర్లను నియమించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పరీక్షలకు అవసరమైన సిబ్బందిని కేటాయించి వారు చేయాల్సిన విధులను ఇప్పటికే వివరించారు. రూట్ ఆఫీసర్లను మధిర డిప్యూటీ డీఈవో రాములు సమన్వయం చేయనున్నారు. పరీక్ష కోసం జిల్లాలో అత్యధికంగా ఖమ్మం నగరంలో 58, కల్లూరులో 7, వైరాలో 4, మధిరలో 6 కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉండనుంది.