ఖమ్మం గుమ్మంలో గులాబీ జాతరకు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 18న ఖమ్మం సమీకృత కలెక్టరేట్ను ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశ్రేఖర్రావు ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ సమీపంలో 100 ఎకరాల స్థలంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ సభకు కేసీఆర్తోపాటు మూడు రాష్ర్టాల ముఖ్యమంత్రులు హాజరుకానున్నారు. బీఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత తొలి సభ కావడంతో గులాబీ నేతలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. దీనికితోడు ఖమ్మం సభ చరిత్రాత్మకం కావాలని అధినేత జిల్లా నేతలకు దిశానిర్దేశం చేయడంతో భారీగా జన సమీకరణకు కసరత్తు చేస్తున్నారు. రాష్ట్ర మంత్రులు మంత్రి తన్నీరు హరీశ్రావు, పువ్వాడ అజయ్, మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి సభ ఏర్పాట్లు, విజయవంతంపై బుధవారం నగరంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో సమీక్షించనున్నారు. పార్టీ నేతలు ఆయా నియోజకవర్గాలో సన్నాహక సమావేశాలు నిర్వహించనున్నారు. కాగా, మంగళవారం సీపీ విష్ణు ఎస్వారియర్, అదనపు డీసీపీ సుభాశ్ చంద్రబోస్, బీఆర్ఎస్ నేతలు సభాస్థలిని పరిశీలించారు.
– ఖమ్మం, జనవరి 10 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
ఖమ్మం, జనవరి 10 (నమస్తే తెలంగాణ ప్రతినిధి):ఈ నెల 18న ఖమ్మంలో సీఎం కేసీఆర్ నిర్వహించనున్న భారీ బహిరంగసభకు జన ప్రభంజనాన్ని తీసుకొచ్చేందుకు జిల్లా గులాబీ నేతలు కసరత్తులు ముమ్మరం చేశారు. సభ కోసం ఇప్పటికే ఏర్పాట్లు మొదలుపెట్టాగా.. మరోవైపు పోలీసు అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. 18న ఖమ్మం సమీకృత కలెక్టరేట్ను సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. అనంతరం బీఆర్ఎస్ తరఫున భారీ బహిరంగసభను నిర్వహించనున్నారు. ఈ సభకు మరో మూడు రాష్ర్టాల ముఖ్యమంత్రులూ హాజరుకానున్నారు. ఈ ప్రతిష్ఠాత్మక సభ విజయవంతం కోసం బీఆర్ఎస్ నేతలు సమాయత్తమయ్యారు. మంత్రి పువ్వాడ అజయ్కుమార్, ఎమ్మెల్సీ తాతా మధు, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు తదితర నేతలు ఇప్పటికే జన సమీకరణపై దృష్టి సారించారు. ఖమ్మం సభను చరిత్రాత్మకం కావాలని అధినేత కేసీఆర్ ఇప్పటికే జిల్లా నాయకులకు దిశానిర్దేశం చేసినందున నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు కూడా జన సమీకరణ, సభ విజయవంతం కోసం రంగంలోకి దిగారు. సీఎం ఆదేశంతో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్తోపాటు రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు, రహదారులు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు.
బుధవారం ఉదయం వారు ఖమ్మం చేరుకొని మంత్రి అజయ్కుమార్ క్యాంపు కార్యాలయంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు, పార్టీ నియోజకవర్గాల ఇన్చార్జులతో సమావేశం కానున్నారు. సభ నిర్వహణకు వారం రోజులు మాత్రమే సమయం ఉండడంతో తీసుకోవా ల్సిన చర్యలపై చర్చిం చను న్నారు. మరోవైపు ఖమ్మం సమీకృత కలెక్టరేట్ ప్రారంభోత్సవానికి అధికారులు సర్వం సమాయత్తమయ్యారు. కలెక్టరేట్ ప్రాంగణంలో 100 ఎకరాల స్థలంలో నిర్వహించనున్న బహిరంగ సభా స్థలిని మంగళవారం ఖమ్మం పోలీసు కమిషనర్ ఆఫ్ పోలీస్ విష్ణు ఎస్ వారియర్, అదనపు డీసీపీ సుభాశ్ చంద్రబోస్, మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పీఏ రవికుమార్ తదితరులు పరిశీలించి సభకు హాజరయ్యే వారికి చేయాల్సిన ఏర్పాట్లపై సమాలోచనలు చేశారు. ముఖ్య అతిథులు హాజరయ్యేందుకు ప్రధాన ద్వారం, వేదిక నిర్మాణం వంటి అంశాలను పరిశీలించారు. అలాగే ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం జిల్లా శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులకు చేసిన దిశానిర్దేశం మేరకు ఆయా శాసనసభ సభ్యులు, పార్టీ నియోజకవర్గ ఇన్చార్జులు ఈ నెల 18వ తేదీన జరిగే సభకు జనసమీకరణ చేసేందుకు మండలాల వారీగా సన్నాహక సమావేశాలను ఏర్పాటు చేస్తున్నారు.
సత్తుపల్లి శాసనసభ్యుడు సండ్ర వెంకటవీరయ్య బుధవారం సత్తుపల్లి, పెనుబల్లి, కల్లూరు మండలాల్లో సన్నాహక సమావేశాలను ఏర్పాటు చేసి మండలాల వారీగా కార్యకర్తలను, పార్టీ శ్రేణులను బహిరంగ సభకు తరలించే అంశాన్ని మండలస్థాయి పార్టీ శ్రేణులకు అప్పగించారు. అలాగే జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు మధిర నియోజకవర్గంలోని పలు మండలాల్లో బుధవారం సన్నాహక సమావేశాలను ఏర్పాటు చేశారు. జనసమీకరణపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. మంత్రి పువ్వాడ అజయ్కుమార్ కూడా తాను ప్రాతినిథ్యం వహిస్తున్న ఖమ్మం నియోజకవర్గం నుంచి భారీగా జనసమీకరణ జరిగేలా చూడాలని స్థానిక నేతలకు ఆదేశాలిచ్చారు. దీంతో రఘునా ధపాలెం మండలం, ఖమ్మం నగరంలోని పార్టీ బాధ్యులు, ప్రజాప్రతినిధులు గ్రామాలు, డివిజన్ల వారీగా జనసమీకరణపై దృష్టి సారించారు. అలాగే ఖమ్మంలో సీఎం ప్రారంభించనున్న సమీకృత కలెక్టరేట్ భవనానికి అధికారులు తుది మెరుగులు దిద్దుతున్నారు.
పనులను సత్వరం పూర్తిచేయాలని అధికారులను కలెక్టర్ వీపీ గౌతమ్ ఆదేశించారు. జరుగుతున్న పనులను రోజువారీగా సమీక్షించడంతోపాటు సత్వరం పూర్తిచేయాలని సంబంధిత శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఖమ్మం సమీకృత కలెక్టరేట్ భవనంలో కలెక్టర్, అదనపు కలెక్టర్లతోపాటు 46 ప్రభుత్వ శాఖల అధికారులు విధులు నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి ఆయా ప్రభుత్వ శాఖల అధికారులకు గదుల కేటాయింపును పూర్తిచేశారు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్టేట్ చాంబర్కు తుది మెరుగులు దిద్దుతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, పంజాబ్, ఢిల్లీ, కేరళ ముఖ్యమంత్రులతోపాటు ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్యాదవ్ ఈ ప్రారం భోత్సవ కార్యక్రమానికి, బహిరంగ సభకు రానుండడంతో వారికి మధ్యాహ్న విందును స్టేట్ చాంబర్లో ఏర్పాటు చేసేందుకు అధికారులు కసరత్తు ప్రారంభించారు. సభకు వచ్చే వాహనాల కోసం ప్రత్యేకంగా పార్కింగ్ను ఏర్పాటు చేశారు.
ఒకేసారి నలుగురు ముఖ్యమంత్రులు జిల్లాకు రానుండడం జిల్లా చరిత్రలో ఇదే మొదటిసారి కావడంతో పోలీసులు అడుగడుగునా భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. హైదరాబాద్ జింకానా గ్రౌండ్స్లో గతంలో టీఆర్ఎస్ నిర్వహించిన బహిరంగ సభకు, ఇటీవల వరంగల్లో జరిగిన బహిరంగ సభకు మించి జనసమీకరణ జరిగేలా పార్టీ నాయకులు చర్యలు ప్రారంభించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాతోపాటు బీఆర్ఎస్ తొలి ఆవిర్భావ సభ కావడంతోపాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లా సరిహద్దు ప్రాంతాల నుంచి కూడా జనాన్ని సమీకరించేలా నాయకులు ఏర్పాట్లు చేస్తున్నారు.