మధిర టౌన్, జూన్ 7: ప్రాజెక్ట్లు, చెక్డ్యాంలు, చెరువుల పునరుద్ధరణతో రాష్ట్రంలో సాగునీటి కొరత లేదని, సాగు జలాలు పుష్కలంగా ఉన్నాయని జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బుధవారం మధిర పట్టణంలోని ఏఎంసీలో నిర్వహించిన సాగునీటి దినోత్సవంలో ఆయన మాట్లాడారు. నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతో నాడు తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిందన్నారు. సీఎం కేసీఆర్ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఉద్యమం సమయంలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నారని కొనియాడారు. సాగునీటి యాజమాన్యంలో రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదన్నారు.
కాంగ్రెస్ పాలనలో ఒకటి, రెండు ప్రాజెక్ట్లు మాత్రమే పూర్తయ్యాయన్నారు. కానీ స్వరాష్ట్రం వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ ఎన్నో ప్రాజెక్ట్లు నిర్మించారన్నారు. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ద్వారా రాష్ట్రంలో లక్షలాది ఎకరాలను సస్యశ్యామలం చేశారన్నారు. నాడు ఇక్కడి కూలీలు పని దొరక్క ఆంధ్రా ప్రాంతానికి వెళ్లేవారని, ఇప్పుడు ఈ ప్రాంతానికే వేలాది మంది వలస వస్తున్నారన్నారు. రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు మాట్లాడుతూ.. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ప్రజలకు సంక్షేమ పాలన అందిస్తూనే, మరోవైపు దార్శనికుడిగా, ఇంజినీర్గా సాగునీటి ప్రాజెక్ట్లు నిర్మిస్తున్నారన్నారు. తొలుత జడ్పీ చైర్మన్ వైరా నదిలో పూలు వదిలారు. కార్యక్రమంలో ఇరిగేషన్ డీఈ నాగబ్రహ్మం, ఆత్మ కమిటీ చైర్మన్ గుర్రం రామారావు, మధిర సొసైటీ చైర్మన్ బిక్కి ప్రసాద్, మున్సిపల్ చైర్పర్సన్ మొండితోక లత, వైస్ చైర్మన్ శీలం విద్యాలత, కమిషనర్ రమాదేవి పాల్గొన్నారు.