20 ఏళ్ల నిరీక్షణకు తెరపడింది. ఖమ్మం జిల్లాలో సైన్స్ మ్యూజియం ఏర్పాటుకు ముందడుగు పడింది. జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయం నూతన కలెక్టరేట్లోకి మారిన వెంటనే ఆ భవనాన్ని సైన్స్ మ్యూజియానికి కేటాయిస్తూ కలెక్టర్ వీపీ గౌతమ్ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే, సైన్స్ మ్యూజియం ఏర్పాటుకు మొదటి విడతగా రూ.20 లక్షలు, రెండో విడతగా రూ.10 లక్షలు విడుదల చేశారు. ఈ నిధులను డీఆర్వో, డీఎస్వో జాయింట్ బ్యాంక్ అకౌంట్ ఎస్బీఐలో జమ చేశారు. ఈ నిధులు 2014 నుంచి ఇప్పటివరకు వడ్డీతో కలిపి రూ.50 లక్షలకుపైగా అందుబాటులో ఉన్నాయి. వీటిని సైన్స్ పరికరాల కోసం ఖర్చు చేయనున్నారు.
ఖమ్మం ఎడ్యుకేషన్, జనవరి 6 : ఖమ్మం జిల్లాలో సైన్స్ మ్యూజియం ఏర్పాటుకు మార్గం సుగమమైంది. డీపీఈపీ పథకంలో భాగంగా రెండు విడతల్లో రూ.30 లక్షలు కేటాయించింది. 2003లో సైన్స్ మ్యూజియం ఏర్పాటుకు ఆదేశాలు రాగా అప్పటి నుంచి ఏదో ఒక అవాంతరం ఎదురవుతూనే ఉంది. 2014లో ఎన్ఎస్పీ స్థలం గుర్తించారు. అధికారులకు నివేదిక ఇచ్చేలోపే ఐటీడీఏ అధికారులు ఆ స్థలం కేటాయించేందుకు అనుమతించకపోవడంతో ప్రక్రియ నిలిచింది. విద్యార్థుల్లో ఆలోచనలను పెంచేందుకు సైన్స్ మ్యూజియం ఏర్పాటుకు సర్కార్ ఆమోద ముద్ర వేసింది. డీఈవో కార్యాలయం నూతన కలెక్టరేట్లోకి మారిన వెంటనే ఆ భవనాన్ని మ్యూజియానికి కేటాయిస్తూ కలెక్టర్ వీపీ గౌతమ్ ఉత్తర్వులు జారీ చేశారు.
రూ.50 లక్షలు అందుబాటులో..
ఖమ్మం జిల్లాలో సైన్స్ మ్యూజియం ఏర్పాటుకు మొదటి విడతగా రూ.20 లక్షలు, రెండో విడతగా రూ.10 లక్షలు విడుదల చేశారు. ఈ నిధులను డీఆర్వో, డీఎస్వో జాయింట్ బ్యాంక్ అకౌంట్ ఎస్బీఐలో జమ చేసి ఉంచారు. ఈ నిధులు 2014 నుంచి ఇప్పటివరకు వడ్డీతో కలిపి రూ.50 లక్షలకుపైగా అందుబాటులో ఉన్నాయి. ఈ నిధులను వెంటనే సైన్స్ పరికరాల కోసం ఖర్చు చేసి మ్యూజియాన్ని ఏర్పాటు చేసి ఈ విద్యాసంవత్సరంలోనే అమలు చేసేందుకు చూస్తున్నారు.
తొలుత ఎన్ఎస్పీలో..
మ్యూజియం నెలకొల్పేందుకు డీఈవోగా రవీంద్రనాథ్రెడ్డి ఉన్న సమయంలో ఎన్ఎస్పీ క్వార్టర్స్లోని సర్వే నంబర్ 86, 92లో 2 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. ఆ స్థలాన్ని ఎన్ఎస్సీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఆధ్వర్యంలో విద్యాశాఖకు అప్పగించారు. అనంతరం జరిగిన పరిణామాలతో ఐటీడీఏ భద్రాచలం అభ్యంతరంతో ఆ స్థలాన్ని కలెక్టర్ ఆదేశాలతో తిరిగి ఐటీడీఏ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వేరే స్థలాన్ని గుర్తించాలని ఆర్డీవో, ఎంఆర్వోలను అప్పటి కలెక్టర్ ఇలంబరితి ఆదేశించారు. అప్పటి నుంచి స్థలాన్ని ఎంపిక చేయలేదు.
మ్యూజియంగా.. డీఈవో కార్యాలయం..
డీఈవో కార్యాలయం నూతన కలెక్టరేట్లోకి మారిన వెంటనే సైన్స్ మ్యూజియం నిర్వహణకు అనువుగా మార్పులు చేయనున్నారు. 2003లో డీపీఈపీ పథకం ద్వారా విద్యార్థుల నైపుణ్యాలు, ఉపాధ్యాయుల సామర్థ్యాలను పెంపొందించేందుకు సైన్స్పై ఆసక్తిని కలిగించేందుకు ఉమ్మడి రాష్ట్రంలో 10 జిల్లాలకు సైన్స్ సెంటర్, సైన్స్ మ్యూజియం ఏర్పాటు చేయడానికి అనుమతులు మంజూరు చేశారు. దీంతో 20 ఏళ్ల నిరీక్షణకు తెరపడింది. సైన్స్ సెంటర్ను నయాబజార్ ఆవరణలో డీఆర్సీలో ఏర్పాటు చేయనున్నారు. జిల్లాలో సైన్స్ కార్యక్రమాలను పటిష్టం చేయడానికి సైన్స్పై ఓరియంటేషన్, సెమినార్స్, ఇతర కార్యక్రమాలు నిర్వహించడానికి అనువుగా తీర్చిదిద్దనున్నారు.
ఆవిష్కరణలకు ప్రోత్సాహం..
నూతన ఆవిష్కరణలు చేపట్టే విద్యార్థులను రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నది. విద్యార్థులు సమాజానికి ఉపయోగపడే ఆవిష్కరణలు చేయాలని, ఆ దిశగా ఉపాధ్యాయులు కృషి చేయాలని విద్యాశాఖ పేర్కొంటున్నది. విద్యార్థులకు ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండాలని, ప్రభుత్వ పాఠశాలల్లోని సైన్స్ ప్రయోగశాలల కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తున్నది. కాగా, సైన్స్ మ్యూజియానికి భవనం కేటాయించడంపై డీఎస్వో సైదులు, సైన్స్ టీచర్స్ ఫోరం నాయకులు కలెక్టర్ గౌతమ్, డీఈవో సోమశేఖరశర్మకు కృతజ్ఞతలు తెలిపారు.