ఖమ్మం కమాన్బజార్, ఆగస్టు 19 : చేసిన అభివృద్ధి గురించి చెప్పుకునే విషయంలో కాంగ్రెస్ వ్యవహరిస్తున్న తీరు హాస్యాస్పదంగా ఉందని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత వద్దిరాజు రవిచంద్ర విమర్శించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులన్నీ తానే చేసినట్లుగా కాంగ్రెస్ ప్రచారం చేసుకుంటుండడం విడ్డూరంగా ఉందని అన్నారు. సనత్నగర్ టిమ్స్ వైద్యశాల ప్రారంభం విషయంలోనూ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తీరు ఇదే విధంగా ఉందని ఎద్దేవా చేశారు. అక్కడ ఆయన గొప్పగా చెప్పుకున్న ఆర్భాటపు మాటలు విడ్డూరాలకే విడ్డూరాలుగా ఉన్నాయని విమర్శించారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. అభివృద్ధి, పరిపాలన, ప్రజా సమస్యల పరిష్కారం వంటి అంశాల్లో ఘోరంగా విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వం.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని తానే చేసినట్లుగా చెప్పుకుంటూ క్రెడిట్ చోరీ చేస్తోందని మండిపడ్డారు.
ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రశ్నించిన బీఆర్ఎస్ నేతలను చీటికీమాటికీ నిర్బంధిస్తున్నారని అన్నారు. సనత్నగర్ టిమ్స్ నిర్మాణం విషయంలో వాస్తవాలను ప్రజలకు చెప్పేందుకు బయలుదేరిన మాజీ మంత్రులను పోలీసులతో అడ్డుకొని గృహ నిర్బంధం చేయడం తీవ్ర అభ్యంతరకరమని అన్నారు. దివంగత మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి విగ్రహాన్ని కూల్చడం, ప్రభుత్వ, ప్రైవేటు భూములను కొల్లగొట్టడం, పేదల భూములను నిషేధిత భూముల జాబితాలో పెట్టడం, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల రద్దుకు కుట్రపన్నడం, ఫీజుల బకాయిలు ఇవ్వకపోవడం, పీఆర్సీలు, డీఏలు ప్రకటించకపోవడం, ఉద్యోగాలను భర్తీ చేయకపోవడం, రైతుబీమా ఎత్తివేయడం, విద్యుత్ కోతలు విధించడం, రైతులకు సకాలంలో సాగునీరు, యూరియా అందించలేకపోవడం వంటివన్నీ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలేనని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై విసిగిపోయిన రాష్ట్ర ప్రజలు బీఆర్ఎస్ వైపు చూస్తున్నారని, కేసీఆర్ను మళ్లీ ముఖ్యమంత్రిని చేసేందుకు సంసిద్ధులై ఉన్నారని స్పష్టం చేశారు.