మణుగూరు రూరల్, మే 5: వంద బెడ్ల ప్రభుత్వాసుపత్రిలో కిందిస్థాయి సిబ్బందిని తాత్కాలిక ప్రాతిపదికన నియమించుకుంటూ రూ.లక్షల్లో కొందరు వ్యక్తులు వసూళ్లకు పాల్పడుతున్నారు. మణుగూరులో కొందరు వ్యక్తులకు తాత్కాలిక పోస్టులు ఇస్తూ.. అవి పర్మినెంట్ అయ్యే అవకాశాలున్నాయంటూ ఆశ చూపిస్తూ. రూ.లక్షల్లో వసూలు చేసి వైద్యశాలలో నియమించినట్లు తెలిసింది. వారు కొద్దిరోజులుగా విధులు నిర్వహిస్తున్నప్పటికీ వారిని ఎవరు నియమించారో ఇక్కడ పనిచేస్తున్న వైద్యాధికారులకు తెలియదని సమాచారం.
ఈ విషయం మణుగూరు వంద బెడ్ల ఆసుపత్రిలో చోటుచేసుకుంది. ఔట్ సోర్సింగ్ సిబ్బంది నియామకానికి టెండరింగ్ జరగకుండానే ఓ కాంట్రాక్ట్ కంపెనీ పేరు చెప్పి దాదాపు 30 మందిని నియమించినట్లు తెలిసింది. వారి నుంచి భారీగా డబ్బులు వసూలు చేసినట్లు సమాచారం. ప్రస్తుతం 46 మంది ఇక్కడ విధులు నిర్వహిస్తుండగా.. వారిలో 20 మంది పేషెంట్ కేర్, 8 మంది సెక్యూరిటీ, 16 మంది స్వీపర్లు, ఇద్దరు సూపర్వైజర్లు ఉన్నారు. అయితే గతం నుంచి పనిచేస్తున్న వారు (కరోనాకు ముందు) 9 మంది కాగా.. మిగతా వారిని ఆస్పత్రిలోని ఓ వైద్యుడు ఓ మధ్యవర్తి ద్వారా నియమించినట్లు తెలుస్తోంది. దాదాపు 30 మందికి పైగా పేషెంట్ కేర్ స్టాఫ్, స్వీపర్, సెక్యూరిటీ ఇలా ఒక్కో విభాగంలో నియమించుకొని వారి నుంచి రూ.లక్షల్లో వసూలు చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే రెండు నెలలుగా విధులు నిర్వహిస్తున్నా వారికి ఇప్పటికీ వేతనాలు ఇవ్వలేదు.
కరోనా కంటే ముందు నుంచి వైద్యశాలలో 9 మంది పనిచేస్తున్నారు. పోస్టుమార్టం సహా వివిధ పనుల నిమిత్తం నేను నలుగురిని నియమించాను. మిగతా ఔట్ సోర్సింగ్ సిబ్బందిని ఎవరు నియమించారో నాకు తెలియదు. వారిని నియమించుకోవాలంటూ ఏ కాంట్రాక్టర్ వద్ద నుంచీ మాకు ఆథరైజ్డ్ లెటర్ రాలేదు.
-పంచగిరి గిరిప్రసాద్, సూపరింటెండెంట్
ఔట్సోర్సింగ్ ఉద్యోగం పర్మినెంట్ అవుతుందని, రూ.18 వేల వేతనం వస్తుందని ఆశ చూపి పేదల నుంచి రూ.లక్షల్లో వసూలు చేస్తున్నారని నా దృష్టికి వచ్చింది. ప్రజలు అలాంటి వారి మాటలు నమ్మొద్దు. ఇలా పేదల నుంచి డబ్బులు వసూలు చేసిన వారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదు. -రేగా కాంతారావు, విప్