అశ్వారావుపేట, ఫిబ్రవరి 21 : సాగులో రైతులకు సాంకేతిక సలహాలు ఇచ్చేందుకు ఆయిల్ ఫెడ్ పరిధిలోని 8 జిల్లాల్లో ఒక్కో జిల్లాకు ఇద్దరు చొప్పున క్షేత్ర పర్యవేక్షణ ఆఫీసర్లను నియమించినట్లు ఆయిల్ఫెడ్ ఎండీ సురేందర్రెడ్డి తెలిపారు. మండలంలో ఆయిల్పాం సాగుపై శిక్షణ పొందుతున్న ఆఫీసర్లను బుధవారం ఆయన కలిసి పలు సూచనలు చేశారు. అశ్వారావుపేట మండలం భీమునిగూడెంకు చెందిన కాసాని వెంకటేశ్వరరావు, దమ్మపేట మండలం దమ్మపేట, పట్వారీగూడేనికి చెందిన ఇనుగంటి మోహన్రావు, కోటగిరి వెంకటేశ్వరరావు పామాయిల్ తోటలను పర్యవేక్షకులతో కలిసి సందర్శించారు. మందలపల్లిలో కొత్తగా పామాయిల్ తోట వేస్తున్న రైతుతో కలిసి మొక్క నాటారు.
అనంతరం ఎండీ మాట్లాడుతూ క్షేత్ర పర్యవేక్షణ ఆఫీసర్లు పామాయిల్ రైతులకు అందుబాటులో ఉండి.. సాగులో ఎదురయ్యే సమస్యలను పరిష్కరిస్తారని చెప్పారు. అలాగే ప్లాంటేషన్ ప్రక్రియ, డ్రిప్, సాగునీరు, ఎరువులు, పురుగు మందుల వినియోగం, మల్చింగ్, పంటల దిగుబడిలో తగు సూచనలు చేస్తారని తెలిపారు. ఆయన వెంట డివిజనల్ ఆఫీసర్ ఆకుల బాలకృష్ణ, అప్పారావుపేట ఫ్యాక్టరీ మేనేజర్ కళ్యాణ్, రాజశేఖర్రెడ్డి తదితరులు ఉన్నారు.