భద్రాద్రి కొత్తగూడెం, జనవరి 8 (నమస్తే తెలంగాణ) : అపరిష్కృత సమస్యలపై ప్రజలు ఇచ్చిన అర్జీలను సత్వరమే పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని కలెక్టర్ ప్రియాంక ఆల అధికారులను ఆదేశించారు. సోమవారం ఐడీవోసీ సమావేశ మందిరంలో అన్ని శాఖల అధికారులతో ప్రజావాణి నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల దరఖాస్తులను స్వీకరించి.. వాటిని పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులకు ఎండార్స్ చేశారు. సారపాకకు చెందిన పూజారి శ్రీదేవి.. కాంట్రాక్టు పద్ధతిలో కుక్ పోస్టు ఇప్పించాలని, టేకులపల్లి మండలం శంభునిగూడెంకు చెందిన సనపా కృష్ణవేణి.. తన నియామకాన్ని నిలిపివేయకుండా అంగన్వాడీ టీచర్గా ఉత్తర్వులు ఇవ్వాలని వినతిపత్రం సమర్పించారు. అశ్వారావుపేట మండలం బబ్బువారిగూడెంకు చెందిన కట్టం అర్జమ్మ, భర్త భీమయ్యకు పోడు పట్టాదారు పాస్ పుస్తకంలో తప్పు దొర్లిందని, దానిని సరిచేసి ఇవ్వాలని కోరారు. ఇల్లెందు మండలం సుభాష్నగర్కు చెందిన అన్నపూర్ణ తాను కోయ కులానికి చెందిన దాననని, ఏజెన్సీ ప్రాంతంలో భవన నిర్మాణం చేసుకుంటుంటే కొందరు తప్పుడు కథనాలు రాశారని, వారిపై చర్య తీసుకోవాలని కలెక్టర్ను కోరగా.. తగు చర్యల నిమిత్తం ఆమె అర్జీని డీపీఆర్వోకు, కొత్తగూడెం ఆర్డీవోకు ఎండార్స్ చేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు రాంబాబు, మధుసూదన్రాజు, డీఆర్వో రవీంద్రనాథ్, అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
కొత్తగూడెం టౌన్, జనవరి 8 : గణతంత్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ డాక్టర్ ప్రియాంక ఆల అధికారులను ఆదేశించారు. సోమవారం ఐడీవోసీ కార్యాలయ సమావేశ మందిరంలో గణతంత్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు ఏర్పాట్లు, ప్రజా పాలన అభయహస్తం దరఖాస్తుల ఆన్లైన్ ప్రక్రియ తదితర అంశాలపై అన్ని శాఖల జిల్లా అధికారులతో సమీక్షించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పరేడ్, మార్చ్ఫాస్ట్, పోలీస్ గౌరవ వందనం నిర్వహణ కార్యక్రమాలను పర్యవేక్షించాలని పోలీస్ అధికారులకు సూచించారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ప్రజలనుద్దేశించి ప్రసంగించేందుకు అన్ని శాఖల అధికారులు డీపీఆర్వోకు ప్రగతి నివేదికలు అందజేయాలని, అసెట్స్ పంపిణీ, స్టాళ్లు ఏర్పాటు చేయాలని డీఆర్డీవోకు సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు రాంబాబు, మధుసూదన్రాజు, డీఆర్వో రవీంద్రనాథ్, అన్ని శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.