భద్రాద్రి కొత్తగూడెం, ఏప్రిల్ 17 ( నమస్తే తెలంగాణ) : యాసంగి సీజన్లో వరి పంటలు సమృద్ధిగా పండటంతో పశువుల మేతకు ఇబ్బంది లేకుండాపోయింది. గతంలో కొడవళ్లతో పంట కోయడంతో కొంత గడ్డి పొలాలకే పరిమితమయ్యేది. ఈ క్రమంలో వేసవి కాలంలో పశువులకు గడ్డి కొరత ఏర్పడేది. ప్రస్తుతం వరి కోత మిషన్లతో కోతలు చేపట్టడం వల్ల ధాన్యంతోపాటు రైతులు వరిగడ్డికీ ప్రాధాన్యమిస్తున్నారు. అంతేకాక యాసంగిలో వరి ఎక్కువగా వేసిన ప్రాంతాల నుంచి పలువురు పశువుల యజమానులు గడ్డి దిగుమతి చేసుకుంటున్నారు. జిల్లా పశు సంవర్థక శాఖ అధికారులు కూడా పశుగ్రాసం నిల్వలపై ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.
గడ్డిని నిల్వ చేసుకుంటున్న రైతులు
యాసంగిలో వరి పంటలు కోతకు రావడంతో పశు యజమానులు వరిగడ్డి దిగుమతి చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు. జిల్లాలో 2 లక్షల పశువులు, 1.25 లక్షల గేదెలు, 1.55 లక్షల గొర్రెలు, 2 లక్షల మేకలు ఉన్నట్లు పశు సంవర్థక శాఖ లెక్కలు చెబుతున్నాయి. వీటి మేత కోసం 5 లక్షల మెట్రిక్ టన్నులు అవసరం ఉండగా.. జిల్లాలో ఇప్పటివరకు 5.36 లక్షల మెట్రిక్ టన్నుల వరిగడ్డి లభ్యత ఉన్నట్లు అధికారులు అంచనా వేశారు. యాసంగి సీజన్లో సరిపడా నిల్వ చేసుకునేందుకు రైతులు నెల రోజుల ముందు నుంచే గ్రాసాన్ని సమకూర్చుకుంటున్నారు. వరి పంట ఎక్కువగా లేని ప్రాంతాల్లో రైతులు ట్రాక్టర్ల ద్వారా గడ్డిని కొనుగోలు చేసి తరలించుకుంటున్నారు.
వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి
వేసవిలో పశువులకు వడదెబ్బ తగలకుండా పశు సంవర్థక శాఖ ముందస్తు చర్యలు చేపట్టింది. గత ఏడాది వేసవిలో పశువులు వడదెబ్బకు ఇబ్బంది పడిన వైనాన్ని గుర్తించి ఆ శాఖ అధికారులు రైతులకు పలు సూచనలు చేస్తున్నారు. సాయంత్రం పశువులు ఇంటికి రాగానే నీటితోపాటు కుడితి తాగేలా చూడాలని సూచిస్తున్నారు. ఉదయం 11 గంటల వరకే మేతకు వెళ్లిన వాటిని ఇంటికి తీసుకురావాలని, తర్వాత సాయంత్రం మేతకు తీసుకెళ్లవచ్చని సూచిస్తున్నారు.
అందుబాటులో గడ్డి విత్తనాలు
రైతులు యాసంగిలో గడ్డి విత్తనాలు వేసేందుకు రెడీ అవుతున్నారు. ఇందుకోసం ఆ శాఖ గడ్డి విత్తనాలను అందుబాటులో ఉంచింది. కొందరు రైతులు కోతలు పూర్తయిన ప్రాంతాల్లో పిల్లిపెసర, జనుము, గడ్డి విత్తనాలను చేలల్లో చల్లారు.
పుష్కలంగా గడ్డి..
ఎండా కాలం అయినా వరిగడ్డి బాగానే దొరుకుతుంది. బీడు భూ ముల్లో గేదెలను మేపుతున్నాం. సుబాబుల్ వేసిన భూముల్లో పచ్చగడ్డి బాగానే ఉంది. చెరువుల పక్కన మేత దొరుకుతుంది. ఇప్పటికే వరిగడ్డి నిల్వ చేసుకున్నాం.
-జోయినబోయిన వెంకటేశ్వర్లు, డేగలమడుగు, సుజాతనగర్ మండలం
కొరత లేకుండా చూస్తున్నాం
జిల్లాలో గడ్డి కొరత లేకుండా చూస్తున్నాం. తక్కువ విస్తీర్ణంలో వరి సాగు చేసినా సరిపడా గడ్డి అందుబాటులో ఉంది. రైతులకు గడ్డి విత్తనాలు కూడా పంపిణీ చేశాం. అవసరం అయితే మా శాఖకు తెలియజేస్తే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తాం.
-బి.పురందర్, జిల్లా పశు సంవర్థకశాఖ అధికారి