ఖమ్మం శివారు వీ వెంకటాయపాలెంలో బుధవారం జరిగిన భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) బహిరంగ సభ చరిత్ర పుటల్లో నిలిచింది.. సువర్ణ అధ్యాయాన్ని లిఖించింది.. ఢిల్లీ పీఠం వణికేలా సభ సాగింది.. జాతీయ మీడియాను ఆకర్షించింది.. జాతీయ రాజకీయాలకు నాంది పలికింది.. యావత్ దేశ ప్రజలు సభను తిలకించారు. సభకు తరలివచ్చిన లక్షలాది మంది ప్రజలు సీఎం కేసీఆర్ ప్రసంగాన్ని ఆసక్తిగా విన్నారు. సభ సక్సెస్పై సీఎం కేసీఆర్ సభ ఇన్చార్జి, మంత్రి హరీశ్రావు, పువ్వాడ అజయ్కుమార్, పార్టీ జిల్లా అధ్యక్షుడు తాతా మధు, ఎంపీలు నామా నాగేశ్వరరావు, వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి తుమ్మల, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులను అభినందించారు. మొత్తానికి సభ పార్టీ నాయకులు, కార్యకర్తల్లో జోష్ నింపింది.
ఖమ్మం, జనవరి 19 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఖమ్మం శివారు వీ వెంకటాయపాలెంలోని వందెకరాల స్థలంలో బుధవారం భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) బహిరంగ సభ దద్దరిల్లింది. ఈ నెల 8న ముఖ్యమంత్రి కేసీఆర్ సభ నిర్వహించాలని నిర్ణయించి సభ ఇన్చార్జిగా రాష్ట్ర ఆర్థిక శాఖా మంత్రి హరీశ్రావును రంగంలోకి దించారు. 18న సభ జరగాల్సి ఉండగా ఆయన 17వ తేదీలోపు రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్, పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, ఎంపీలు నామా నాగేశ్వరరావు, వద్దిరాజు రవిచంద్రతో కలిసి చకచకా ఏర్పాట్లు పూర్తి చేశారు. వారికి శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు సహకరించి భారీగా జన సమీకరణ చేశారు. ప్రతి నియోజకవర్గంలో మంత్రి హరీశ్రావు ఆధ్వర్యంలో ముందుగానే సభ సన్నాహక సమావేశాలు నిర్వహించి లక్షలాది మందిని సభకు తరలించేలా ఏర్పాట్లు చేశారు. సభకు తరలొచ్చిన జనాన్ని చూసి ఢిల్లీ, పంజాబ్, కేరళ సీఎంలు అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్, పినరయి విజయన్, యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా ముగ్ధులయ్యారు. సభ గ్రాండ్ సక్సెస్ కావడంతో పార్టీ నాయకులు, కార్యకర్తల్లో జోష్ నిండింది.
బీఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత జరిగే తొలిసభను యావత్ దేశ ప్రజలను ఆకర్షించే రీతిలో తీర్చిదిద్దిన సభ ఇన్చార్జి, రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావుకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. సభకు అశేష జనవాహినికి సకల సౌకర్యాలు కల్పించడంపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. మంత్రి హరీశ్రావుతో పాటు రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్, పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాతా మధుసూదన్, ఎంపీలు నామా నాగేశ్వరరావు, వద్దిరాజు రవిచంద్ర ఖమ్మంలోనే మకాం వేసి సభా ఏర్పాట్లు పూర్తి చేయడంలో సక్సెస్ అయ్యారు. మంత్రి హరీశ్రావు ప్రతిరోజూ తెల్లవారుజామునే సభా స్థలికి చేరుకుని ఏర్పాట్లను పర్యవేక్షించి నేతలను అప్రమత్తం చేయడంతో సకాలంలో పనులు పూర్తయ్యాయి. అలాగే సమీకృత కలెక్టరేట్ ప్రారంభోత్సవానికి మంత్రి పువ్వాడ అజయ్కుమార్తో కలిసి ఏర్పాట్లను పర్యవేక్షించారు. సకలంలో ప్రారంభోత్సవ పనులు పూర్తి చేయించారు. సభా ఏర్పాట్ల కోసం వచ్చిన అతిథులందరికీ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర తన నివాసంలో అతిథ్యమిచ్చారు.
ఖమ్మం జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్రాజు, ప్రభుత్వ విప్, పార్టీ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు, ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, కందాళ ఉపేందర్రెడ్డి, రాములునాయక్, హరిప్రియ, మెచ్చా నాగేశ్వరరావు, రైతుబంధు సమితి రాష్ట్ర చైర్మన్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి పార్టీ నేతలు, నాయకులను సమన్వయం చేసుకుంటూ జనాన్ని సమీకరించారు. స్వచ్ఛందంగా సభకు తరలేలా పనిచేశారు. వారికి వాహనాలను సమకూర్చారు. పది నియోజకవర్గాల పరిధిలోని నాయకులు, ప్రజాప్రతినిధులు గ్రామస్థాయిలోకి వెళ్లి సభ గురించి తెలియజేశారు. లక్షలాదిగా తరలివచ్చిన ప్రజలకు వెయ్యి మంది వలంటీర్లు సహాయ సహకారాలు అందించారు. సభ మధిర నియోజకవర్గ ఇన్చార్జి, జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు, సత్తుపల్లి శాసనసభ్యుడు సండ్ర వెంకటవీరయ్య వారి నియోజకవర్గాల్లో సన్నాహక సమావేశాలు నిర్వహించి ప్రజానీకాన్ని సభకు తరలేలా ఏర్పాట్లు చేశారు. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మంత్రి హరీష్రావు, ఎంపీలు బండి పార్థసారథిరెడ్డి, నామా నాగేశ్వరరావు, వద్దిరాజు రవిచంద్ర, నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి, సత్తుపలి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య తదితరులు బీఆర్ఎస్ సభ నిర్వహణ ఉద్దేశ్యం, జాతీయ స్థాయిలో సభకు లభించనున్న గుర్తింపుపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.
సభను సక్సెస్ చేసేందుకు సభ ఇన్చార్జి, నియోజకవర్గాల ఇన్చార్జులు, ఎమ్మెల్యేలతో పాటు పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాతా మధు అహర్నిశలు శ్రమించారు. సర్పంచ్లు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, సహకార సంఘాల అధ్యక్షులు, మున్సిపల్ చైర్మన్లు, మండల, గ్రామకమిటీల బాధ్యులు, కార్యకర్తలు, నాయకులను ముందుండి నడిపించారు. రాష్ట్ర వైద్య, మౌలిక సదుపాయాల సంస్థ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, ఇల్లెందు ఎమ్మెల్యే హరిప్రియ నియోజకవర్గంలో విస్తృత సమావేశాలు నిర్వహించి కార్యకర్తలను జాగృతం చేశారు. శాసనసభ్యుడు సండ్ర వెంకటవీరయ్య నేతృత్వంలో జరిగిన సన్నాహక సమావేశం నాయకులను ఆకర్షించింది. బోగి రోజు జరిగిన ఈ సమావేశం ప్రత్యేకతను చాటుకున్నది.
వందెకరాల్లో సభాస్థలి, 440 ఎకరాల్లో పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేయడం పార్టీ నేతల శక్తి సామర్థ్యాలకు నిదర్శనం. కలెక్టరేట్ ఏర్పాట్లపైనా సీఎం కేసీఆర్ జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలపై ప్రశంసల జల్లు కురిపించారు. ముగ్గురు ముఖ్యమంత్రులు, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్, సీపీఐ జాతీయ కార్యదర్శి రాజా వంటి జాతీయ స్థాయి నేతల గౌరవానికి తగినట్లుగా ఏర్పాట్లు, విందు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. సీఎం కేసీఆర్ కలెక్టరేట్ ప్రారంభోత్సవంలో భాగంగా కలెక్టర్ వీపీ గౌతమ్ను స్వయంగా తన సీట్లో కూర్చొబెట్టడం, అతిథులు కలెక్టర్కు శుభాకాంక్షలు తెలపడం అరుదైన అంశంగా నిలిచింది. కాంగ్రెస్ శాసన సభాపక్ష నేత, మధిర ఎమ్మెల్యే భట్టి విక్రమార్కను సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా అతిథులకు పరిచయం చేయడం ప్రాధాన్యతను సంతరించుకున్నది. అది సీఎల్పీ నేతకు దక్కిన సముచిత గౌరవంగా పలు వర్గాలు భావిస్తున్నాయి.
సభకు ఉప్పెనలా తరలివచ్చిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలను చూసి ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం మంత్రులు హరీశ్రావు, పువ్వాడ అజయ్కుమార్, ఎంపీలు నామా నాగేశ్వరరావు, బండి పార్థసారథిరెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాతా మధు, పినపాక విప్, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, పార్టీ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు, కొత్తగూడెం, సత్తుపల్లి, పాలేరు, వైరా, ఇల్లెందు శాసనసభ్యులు వనమా వెంకటేశ్వరరావు, సండ్ర వెంకటవీరయ్య, కందాళ ఉపేందర్రెడ్డి, లావుడ్యా రాములునాయక్, హరిప్రియ, జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్రాజుకు కాల్ చేసి అభినందనలు తెలియజేశారు.