నవభారత వైతాళికుడు.. విశ్వమానవుడు.. సామాజిక సమతా స్ఫూర్తి.. సమున్నత విజ్ఞాన మూర్తి.. బడుగుల దీప్తి.. అణగారిన వర్గాల ఆశాజ్యోతి.. డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్.. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ 132వ జయంతి వేడుకలు ఉమ్మడి ఖమ్మం జిల్లావ్యాప్తంగా శుక్రవారం వైభవంగా జరిగాయి. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, వివిధ సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, పలు పార్టీల ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో పలుచోట్ల అన్నదానాలు, రక్తదాన శిబిరాలు నిర్వహించారు. అనాథ ఆశ్రమాలు, ప్రభుత్వ వైద్యశాలల్లో పండ్లు పంపిణీ చేశారు. పలు గ్రామాల్లో అంబేద్కర్ విగ్రహాలను ఆవిష్కరించారు. ఊరూరా పండుగ వాతావరణం తలపించగా.. జైభీమ్ నినాదాలతో పల్లె, పట్నం మార్మోగింది. ఆయాచోట్ల జరిగిన కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు, ఖమ్మం జడ్పీచైర్మన్, ఇతర ప్రజాప్రతినిధులు, ఖమ్మం, భద్రాద్రి కలెక్టర్లు, సీపీ, ఎస్పీ తదితరులు పాల్గొన్నారు. కాగా, హైదరాబాద్లో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి ఉమ్మడి జిల్లా నుంచి అధికారులు, ప్రజాప్రతినిధులు భారీగా తరలివెళ్లారు.
– ఖమ్మం, ఏప్రిల్ 14 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
ఖమ్మం, ఏప్రిల్ 14 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ మహనీయుడని వక్తలు పేర్కొన్నారు. ఆయన ఆశయాలు సదా ఆచరణీయమైనవని అన్నారు. బాబా సాహెబ్ జయంతి వేడుకలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా శుక్రవారం ఘనంగా జరిగాయి. అధికారిక కార్యక్రమమైనందున ప్రభుత్వ శాఖల అధికారులతోపాటు బీఆర్ఎస్ నేతలు, వివిధ సంస్థల బాధ్యులు, సంఘాల నాయకులు ఊరూరా వేడుకలు నిర్వహించారు. గ్రామస్థాయి నుంచి మొదలుకొని జిల్లా కేంద్రం వరకు ఎక్కడ చూసినా ‘జై భీమ్’ నినాదాలు వినిపించాయి. అన్ని చోట్లా రాజ్యాంగ నిర్మాత చిత్రపటాలకు, విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఖమ్మంలోని అంబేద్కర్ కాంస్య విగ్రహానికి జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు, కలెక్టర్ వీపీ గౌతమ్, సీపీ విష్ణు ఎస్ వారియర్, మేయర్ పునుకొల్లు నీరజ ,సుడా చైర్మన్ బచ్చు విజయ్కుమార్లు పూలమాలలు వేసి నమస్కరించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో జరిగిన వేడుకల్లోనూ కలెక్టర్ అనుదీప్, ఎస్పీ వినీత్ హాజరై అంబేద్కర్ చిత్రపటాలకు నివాళులర్పించారు. సత్తుపల్లిలో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కొత్తూరు ఉమామహేశ్వరరావు, మధిరలో జడ్పీ చైర్మన్ కమల్రాజు పాల్గొన్నారు. నాయుడుపేట, ఎం.వెంకటాయపాలెం తదితర గ్రామాల్లో సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేశారు. ఏదులాపురంలో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరానికి మంచి స్పందన కన్పించింది. వీటితోపాటు ఇంకా పలు మండలాల్లో అన్నదానాలు, అనాథాశ్రమాలు, ప్రభుత్వ వైద్యశాలల్లో పాలు, పండ్ల పంపిణీ కార్యక్రమాలు జరిగాయి.