కామేపల్లి, జనవరి 13: ఖమ్మంలో ఈ నెల 18న నిర్వహించనున్న బీఆర్ఎస్ బహిరంగ సభకు ప్రజలందరూ దండులా కదిలి వస్తారని ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తాతా మధుసూదన్ పేర్కొన్నారు. వారి కోసం పార్టీ నాయకులు, కార్యకర్తలు గ్రామగ్రామానా అన్ని సౌకర్యాలూ సిద్ధం చేసి ఉంచాలని సూచించారు. ఖమ్మంలో సీఎం కేసీఆర్ నిర్వహించనున్న బహిరంగ సభ విజయవంతం కోసం మండలంలోని కొత్త లింగాల ధనలక్ష్మి ఫంక్షన్ హాల్లో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ధనియాకుల హనుమంతరావు అధ్యక్షతన శుక్రవారం నిర్వహించిన మండల సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతీ గ్రామం నుంచి స్వచ్ఛందంగా కదిలి వచ్చే ప్రజల కోసం సదుపాయాలు ఏర్పాటు చేసే బాధ్యతను ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు తీసుకోవాలని సూచించారు. అనంతరం ఇల్లెందు ఎమ్మెల్యే హరిప్రియ మాట్లాడుతూ.. ఈ నెల 18న ఖమ్మంలో జరిగే భారత రాష్ట్ర సమితి బహిరంగ సభ పార్టీకి ఎంతో ప్రతిష్ఠాత్మకమైదని అన్నారు. మండలం నుంచి శ్రేణులు భారీగా ప్రజలు పయనమయ్యేందుకు సిద్ధమవుతున్నారని అన్నారు. వారందరికీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు సహకరించాలని సూచించారు. తెలంగాణ వైద్య సేవలు, మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ.. సభ విజయవంతం కోసం ప్రతి కార్యకర్తా సైనికుడిలా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఎంపీపీ బానోత్ సునీత, పీఏసీఎస్ చైర్మన్ తీర్థాల చిదంబరరావు, కీసర విష్ణువర్థన్రెడ్డి, ఆంతోటి అచ్చయ్య, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.