గడప గడపకూ సంక్షేమ పథకాలు చేరాయి. సబ్బండ వర్గాలకు సర్కార్ వెన్నుదన్నుగా నిలుస్తున్నది. చేతి, కులవృత్తులకు చేయూతనందిస్తున్నది. పల్లెల్లో వలసలకు అడ్డుకట్ట వేసింది. ఉపాధికి ఊతమిచ్చింది. పంచాయతీలు, మున్సిపాల్టీల్లో నిధుల ప్రవాహం కొనసాగుతున్నది. ‘కల్యాణలక్ష్మి’, ‘షాదీ ముబారక్’తో ఆడబిడ్డల కండ్లలో ఆనందం నింపింది. పేదింటి వెలుగులు పంచింది. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలకు ‘ఆసరా’ భరోసా కల్పించింది. ‘రైతుబంధు’ పథకం అన్నదాతకు ఆత్మబంధువై నిలిచింది. బీమా కర్షకుల్లో ధీమా పెంచింది. ధరణితో భూ సమస్యలకు చెక్ పెట్టింది. దళిత బంధుతో ఎస్సీల జీవితాలను మార్చేసింది. సీఎం కేసీఆర్ పాలనలో అభివృద్ధి, సంక్షేమం జోడెడ్లలా పరుగులు తీస్తున్నాయి. ఇంటింటా సంక్షేమం.. ఊరూరా సౌభాగ్యం పరిఢవిల్లుతున్నది. సకల జనులు సంబురపడుతున్నారు.
ఖమ్మం, మార్చి 16 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : తెలంగాణ ఆవిర్భావం తరువాత సీఎం కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో ఖమ్మం జిల్లా అగ్రగామిగా ఉంది. 2014 నుంచి ఇప్పటి వరకు అమలు చేసిన పథకాల ద్వారా లక్షలాది మంది ప్రజల జీవితాల్లో వెలుగులు నిండాయి. సబ్బండ వర్గాలకు లబ్ధి చేకూర్చేలా ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక పథకాలను అమలు చేస్తున్నారు. ఒక వైపు అభివృద్ధి, మరోవైపు సంక్షేమ పథకాల ద్వారా తెలంగాణ ప్రజల ఆకలిని తీర్చిన గొప్ప నాయకుడు సీఎం కేసీఆర్. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి పథకమూ ఖమ్మం జిల్లాలో విజయవంతమయ్యేలా మంత్రి పువ్వాడ అజయ్కుమార్, ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, ఎంపీలు నిత్యం పర్యవేక్షిస్తున్నారు. దీంతో పథకాలన్నీ పూర్తి పారదర్శకంగా అమలవుతున్నాయి.
ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్..
పరిపాలనా సౌలభ్యం కోసం ప్రభుత్వ జిల్లా కార్యాలయాలన్నీ ఒకే చోట ఉండాలన్న తలంపుతో రాష్ట్ర ప్రభుత్వం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయాల నిర్మాణాలన చేపట్టింది. ఇందులో భాగంగా రూ.53.20 కోట్లతో రఘునాథపాలెం మండలంలోని వీవీపాలెంలో అన్ని హంగులతో ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ను నిర్మించింది. పంజాబ్, ఢిల్లీ, కేరళ ముఖ్యమంత్రులు భగవంత్సింగ్ మాన్, అరవింద్ కేజ్రీవాల్, పినరయి విజయన్, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ సమక్షంలో ఈ ఏడాది జనవరి 18న సీఎం కేసీఆర్ దీనిని వైభవంగా ప్రారంభించారు.
ధరణితో ధర్జాగా పట్టా…
పాఠశాల విద్యకు నిధులు..
పాఠశాల విద్యలో మరింత ప్రగతిని సాధించడానికి ప్రభుత్వం ‘మన ఊరు – మన బడి’, ‘మన బస్తీ – మన బడి’ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. ఇందులో భాగంగా మొదటి విడతగా 2021-22 విద్యా సంవత్సరంలో జిల్లాలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత ఉన్నత పాఠశాలల నుంచి అధిక నమోదు కలిగిన 426 పాఠశాలలను ఎంపిక చేసింది. మౌలిక సదుపాయాలు కల్పించి వీటిని కార్పొరేట్కు దీటుగా తీర్చిదిద్దుతోంది. జిల్లాలో రూ.135 కోట్లతో వీటిల్లో పనులు చురుకుగా కొనసాగుతున్నాయి. ‘మన ఊరు -మన బడి’ కార్యక్రమంలో రాష్ట్రంలోనే ఖమ్మం జిల్లా అగ్రభాగంగా ఉంది.
సీఎం హామీ నిధులు విడుదల..
జనవరి 18న ఖమ్మం సభలో సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీల నిధులు విడుదలయ్యాయి. ఒక్కో పంచాయతీకి రూ.10 లక్షల చొప్పున ఖమ్మం జిల్లాలోని 589 గ్రామ పంచాయతీలకు ముఖ్యమంత్రి ప్రత్యేక నిధి నుంచి రూ.58.90 కోట్లు మంజూరయ్యాయి. ఈ నిధులతో గ్రామ పంచాయతీల్లో రోడ్లు, డ్రెయిన్లు నిర్మాణం కానున్నాయి. తద్వారా గ్రామీణ ప్రజల అవసరాలను తీర్చినట్లు అవుతుంది. అలాగే, ఖమ్మం రూరల్ మండలం పెద్దతండా, ఏదులాపురం, కల్లూరు, తల్లాడ, నేలకొండపల్లి మండల కేంద్రాల్లో 10 వేల జనాభా ఉన్నప్పటికీ అవి మున్సిపాలిటీలుగా రూపాంతరం చెందలేదు. మేజర్ పంచాయతీలుగానే కొనసాగుతున్నాయి. దీంతో వాటిపై ప్రత్యేక దృష్టి సారించిన సీఎం కేసీఆర్.. ఒక్కో మేజర్ గ్రామ పంచాయతీకి ముఖ్యమంత్రి ప్రత్యేక నిధి నుంచి రూ.పది కోట్ల చొప్పున మంజూరు చేశారు. ఇక ఖమ్మం నగరం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందినప్పటికీ మరిన్ని అభివృద్ధి పనుల కోసం మరో రూ.50 కోట్లను మంజూరు చేశారు.
దళితబంధు
దళిత సాధికారత కోసం రాష్ట్ర ప్రభుత్వం దళితబంధు పథకం ప్రవేశపెట్టింది. ఎస్సీల స్వయం ఉపాధికి చేయూతనిచ్చి వారి జీవితాలను మార్చడమే ఈ పథకం ఉద్దేశం. ఖమ్మం జిల్లాలో చింతకాని మండలాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు. ఆ మండలంలో ఉన్న దళితులందరికీ సంపూర్ణంగా ఈ పథకం ద్వారా లబ్ధిపొందేలా ఏర్పాట్లు చేశారు. ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షలు అందించడం ద్వారా లబ్ధిదారుడికి ఆసక్తి ఉన్న రంగాల్లో యూనిట్లను నెలకొల్పుకునేలా వీలు కల్పించారు. వారు ఆర్థికాభివృద్ధి సాధించేందుకు రూ.346.20 కోట్లతో 3,462 యూనిట్లను గ్రౌండింగ్ చేశారు. అలాగే జిల్లాలో ఐదు శాసనసభ నియోజకవర్గాల్లో నియోజకవర్గానికి 100 యూనిట్ల చొప్పున 483 యూనిట్లను రూ.48.30 కోట్లతో గ్రౌండింగ్ చేశారు.
మూడు మున్సిపాలిటీలకు రూ.90 కోట్లు..
మధిర, వైరా, సత్తుపల్లిల్లో మూడు ప్రధాన ముల్సిపాలిటీలు ఉన్నాయి. వీటి అభివృద్ధి కోసం ఒక్కో మున్సిపాలిటీకి రూ.30 కోట్ల చొప్పున రూ.90 కోట్లను సీఎం కేసీఆర్ మంజూరు చేశారు. దీంతో ఆయా మున్సిపాలిటీల రూపురేఖలు మారనున్నాయి. ఈ నిధులతో మరికొన్ని సీసీ రోడ్లు, డ్రెయిన్లు నిర్మిస్తారు. సెంట్రల్ లైటింగ్, జంక్షన్లు, పార్కులు ఏర్పాటు చేస్తారు. మరికొన్ని అభివృద్ధి పనులు చేపడతారు.
రైతుబంంధు/ రైతుబీమా..
పంటల సాగు కోసం రైతులకు పెట్టుబడి ఇబ్బంది లేకుండా ఉండేందుకే బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుబంధు పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం కింద రైతులకు వానకాలం, యాసంగి పంటలకు గాను ఒక్కో సీజన్కు ఎకరానికి రూ.5 వేల చొప్పున రెండు విడతలుగా సంవత్సరానికి రూ.10 వేలను నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లోనే జమ చేస్తోంది. జిల్లాలో ఈ పథకం కింద యాసంగికి గాను ఇప్పటి వరకు 3,02,057 మంది రైతులకు రూ.295.74 కోట్లు అందాయి. రైతుబీమా కింద 2022లో 298 క్లయిములకు గాను రూ.14.90 కోట్ల పరిహారం అందింది.
మున్నేటిపై త్వరలో తీగల వంతెన..
ఖమ్మం ఏర్పడిన తొలి రోజుల్లో బ్రిటీష్ కాలంలో మున్నేరు నదిపై కాల్వొడ్డు, నాయుడుపేట మధ్య వంతెన నిర్మించారు. ఇది నిర్మితమై సుమారు వందేళ్లవుతోంది. దీనికి అనేకమార్లు మరమ్మతులు చేయడం, భారీ వాహనాలను నిషేధించడం వంటి కారణాలతో ఇప్పటి వరకూ అది చెక్కు చెదరలేదు. దీని స్థానంలో నూతన బ్రిడ్జి నిర్మించాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అనేకమార్లు ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిని పరిగణనలోకి తీసుకున్న సీఎం కేసీఆర్.. ఇటీవల ఖమ్మంలో జరిగిన సభలో మున్నేరుపై పాత బ్రిడ్జి స్థానంలో తీగల వంతెన నిర్మాణానికి హామీ ఇచ్చారు. ఆ మేరకు రూ.180 కోట్ల నిధులు కూడా మంజూరు చేశారు. దాని నిర్మాణానికి టెండర్ ప్రక్రియ కూడా అతి త్వరలోనే పూర్తికానుంది. ఆ వెంటనే పనులు ప్రారంభం కానున్నాయి.
గోళ్లపాడు చానెల్ ఆధునీకరణ..
ముఖ్యమంత్రి కేసీఆర్ తన వాగ్దాన నిధులతో ఖమ్మం నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. ఇందులో భాగంగా రూ.100 కోట్లతో గోళ్లపాడు కాలువ ఆధునీకరణ పనులు చేపట్టారు. గతంలో ఈ ఏరియా మురికివాడగా, దుర్గంధం వెదజల్లే ప్రాంతంగా ఉండేది. ఇక్కడ ఆధునీకరణ పనులు చేపట్టి దుర్గంధాన్ని రూపుమాపారు. అదే ప్రాంతంలో ఆహ్లాదకరమైన పార్కులు, ఓపెన్ జిమ్ములు ఏర్పాటు చేశారు. ఈ పార్కులకు తెలంగాణ వైతాళికులు ప్రొఫెసర్ జయశంకర్ సార్, కొండా లక్ష్మణ్ బాపూజీ, కాళోజీ నారాయణరావు, మంచికంటి కిషన్రావు, ఎండీ రజబ్అలీ, పద్మశ్రీ వనజీవి రామయ్య పేర్లు పెట్టారు.
రెండో విడుత ‘కంటి వెలుగు’కు శ్రీకారం..
‘సర్వేంద్రియానాం నయనం ప్రధానం’ అని తలచిన బీఆర్ఎస్ ప్రభుత్వం.. కంటి వెలుగు కార్యక్రమాన్ని చేపట్టింది. .సీఎం కేసీఆర్ ఈ ఏడాది జనవరి 18న రాష్ట్ర వ్యాప్తంగా రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని ఖమ్మం జిల్లాలోనే ప్రారంభించారు. పంజాబ్, ఢిల్లీ, కేరళ ముఖ్యమంత్రులు భగవంత్మాన్, అరవింద్ కేజ్రీవాల్, పినరయి విజయన్, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ సమక్షంలో సీఎం కేసీఆర్ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. జిల్లాలో ఏర్పాటు చేసిన 55 కంటి వెలుగు బృందాల ద్వారా అర్హులైన 15,81,782 మందికి స్క్రీనింగ్ చేసి అవసరమైన వారికి నాణ్యమైన కళ్లద్దాలను ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. ఈ కార్యక్రమం 100 రోజుల పాటు కొనసాగనుంది. దృష్టిలోపం ఉన్న వారిని గుర్తించి తగిన చికిత్సలు అందిస్తున్నారు.
ఆర్థికంగా ఉన్నతి స్థితికి చేరుకుంటున్నాం..
స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లు అవుతున్నా దళితుల ఆర్థికాభివృద్ధి కోసం ఏ ప్రభుత్వమూ చొరవ చూపలేదు. కానీ తెలంగాణ ఉద్యమ నాయకుడు, సీఎం కేసీఆర్ దళిత సాధికారత కోసం సంకల్పించారు. ఇందుకోసం దళితబంధు పథకాన్ని తెచ్చారు. ఈ పథకంతో మా మండలంలోని దళితులందరి జీవితాల్లో వెలుగు నిండాయి. అందరమూ ఆర్థికంగా ఉన్నత స్థితికి చేరుకుంటున్నాం. గతంలో నేను దర్జీ పనిచేసుకుంటూ కూలి దొరికినప్పుడల్లా వెళ్లే వాడిని. కానీ దళితబంధు పథకం మాకు వెన్నుదన్నుగా నిలిచింది. ఈ పథకం కింద నాతోపాటు మరో ముగ్గురం కలిసి ఓ జేసీబీని కొనుగోలు చేశాం. సీజన్లో రోజుకు రూ.3 వేలకు పైగానే ఆదాయం వస్తోంది.
– కొల్లి బాబు, దళితబంధు లబ్ధిదారుడు,
నాగులవంచ, చింతకాని
కేసీఆర్ కిట్తో ఆర్థిక సాయం
– పల్లపు త్రివేణి, ప్రొద్దుటూరు, చింతకాని
ఏళ్ల పాటు గోసడినం..
బతుకుదెరువు కోసం ఎక్కడి నుంచో ఖమ్మం వచ్చినం. ఇంటి కిరాయిలు కట్టలేక గోళ్లపాడు చానల్పై తాత్కాలిక గుడిసె నిర్మించుకున్నం. కూలి పనులు చేసుకుంటూ గుడిసెల్లో నివాసం ఉన్నాం. నిత్యం రాత్రిళ్లు దోమలతో నివాసం చేసినం. పిల్లలతో అనేక గోసలు పడినం. తెలంగాణ ప్రభుత్వం మాకు ప్రయత్నాయంగా వెలుగుమట్ల ప్రాంతంలో పట్టాలను అందించి నివాసాలు ఏర్పాటు చేసి శాశ్వత పరిష్కారం చూపింది.
– చెన్నబోయిన ఆదిలక్ష్మి, గోల్లపాడు చానల్ నివాసి
కల్యాణలక్ష్మితో భరోసా
పేద కుటుంబాల్లో ఆడబిడ్డల పెళ్లి చేసేందుకు గతంలో తీవ్ర ఇబ్బందులు పడేవారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కల్యాణలక్ష్మి పథకాన్ని చేపట్టి మాలాంటి పేద కుటుంబాల్లో వెలుగులు నింపారు. నా కుమార్తె కావ్యకు ఇటీవల వివాహం చేశాం. కల్యాణలక్ష్మి పథకం ద్వారా రూ.1,00116 అందుకున్నా. పెళ్లికి చేసిన అప్పులో కొంతభాగాన్ని ఈ సాయంతో తీర్చేశాం. ఈ పథకాన్ని తెచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్కు ప్రత్యేక కృతజ్ఞతలు. నాలాంటి పేద కుటుంబాల్లో ఆయన వెలుగులు నింపుతున్నారు.
– కాటినేని కృష్ణవేణి, తాళ్లపెంట, పెనుబల్లి