ఖమ్మం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విమానాశ్రయం ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని కోరిన నేపథ్యంలో మూడు నెలల క్రితం విమానాశ్రయం ఏర్పాటుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే విమానాశ్రయం నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం పాల్వంచ మండలం గుడిపాడు వద్ద ప్రతిపాదించిన భూమికి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా తాజాగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో విమానాశ్రయం నిర్మాణానికి అవసరమైన సాంకేతిక అడ్డంకులు దాదాపు తొలగినట్లయింది.
రాష్ట్రంలో విమానాశ్రయ నిర్మాణాలకు అనుకూలమైన స్థలాలను పరిశీలించిన ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా పాల్వంచ మండలం గుడిపాడు వద్ద రాష్ట్ర ప్రభుత్వం సేకరించిన భూమిని అన్నిరకాలుగా అనువైన ప్రదేశంగా భావించి గ్రీన్ ఫీల్డ్గా గుర్తించింది. విమానాశ్రయం నిర్మాణానికి భూమి పూర్తిగా సానుకూలంగా ఉందని భావించి ఈ ప్రాంతంలో విమానాశ్రయం నిర్మాణానికి పూర్తిసానుకూలతను వ్యక్తం చేసింది. తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్న ఆరు విమానాశ్రయాలకు సంబంధించి ఏఐఐ(ఎయిర్పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా) నేలస్వభావాలతో పాటు మట్టి నమూనాలను సేకరించడంతో పాటు ప్రస్తుతం ఉన్న ట్రాఫిక్, భవిష్యత్లో పెరగనున్న ట్రాఫిక్పై రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో కలిసి సమగ్ర సర్వే నిర్వహించింది.
వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకుంటూ తాము రూపొందించిన సర్వే నివేదికను ఎయిర్పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా రాష్ట్ర ప్రభుత్వానికి ఇటీవల సమర్పించింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విమానాశ్రయం నిర్మాణానికి పూర్తి సానుకూలత వ్యక్తం కావడంతో ఇక నిర్మాణ పనులకు సంబంధించి ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. రాష్ట్రంలో ఆరు విమానాశ్రయాల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా అందులో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఒకటి. ఎయిర్పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా నిర్వహించిన సర్వేలో విమానాశ్రయం నిర్మాణానికి గల అనుకూలతలు, ప్రతికూలతలు సైతం ప్రస్తావించి ఈ మేరకు నివేదిక రూపొందించింది.
టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత…
టెక్నో ఎకనామిక్ ఫీజ్బిలిటీ రిపోర్టును రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నిర్మించతలపెట్టిన విమానాశ్రయభూములకు సంబంధించి సైట్ క్లియరెన్స్ ఇవ్వాలని ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు తమ నివేదికలో ప్రభుత్వాన్ని కోరారు. ఎయిర్పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు సానుకూల నివేదిక ఇవ్వడంతో జిల్లా ప్రజల చిరకాల కోరికగా ఉన్న విమానాశ్రయం ఏర్పాటు ప్రక్రియ మరింత చేరువకానుంది. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పారిశ్రామికంగా కొత్తగూడెం అభివృద్ధి చెందుతుండటంతో పాటు దక్షిణ అయోధ్యగా పేరొందిన భద్రాచలంలో శ్రీసీతారామచంద్రస్వామి దేవాలయానికి పలు ప్రాంతాల నుంచి భక్తులు, పర్యాటకుల రాకపోకలు ఈ విమానాశ్రయం ఏర్పాటు వల్ల మరింత పెరిగే అవకాశం ఉన్నది.
విమానాశ్రయం కోసం 1000 ఎకరాల ప్రభుత్వ భూమి..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విమానాశ్రయం ఏర్పాటుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత కొన్ని సంవత్సరాలుగా తమవంతు ప్రయత్నాలు చేసి ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించింది. కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాంతంలో విమానాశ్రయం ఏర్పాటుపై రైట్స్ అనే సాంకేతిక సంస్థతో గతంలోనే సర్వే నిర్వహించింది. తొలుత కొత్తగూడెం సమీపంలోని పునుకుడుచెలక వద్ద నిర్మించాలని భావించినా వివిధ సాంకేతిక కారణాల వల్ల అక్కడ విమానాశ్రయం ఏర్పాటు సాధ్యంకాదని కేంద్ర అధికారులు తేల్చిచెప్పారు. దీంతో పారిశ్రామిక ప్రాంతమైన పాల్వంచ మండలం గుడిపాడు గ్రామంలో పిల్లవాగు సమీపంలో 999 సర్వేనెంబరులో 1000 ఎకరాల ప్రభుత్వ భూమిని విమానాశ్రయం కోసం రెవెన్యూ అధికారులు సిద్ధం చేశారు.
గ్రీన్ఫీల్డ్గా గుర్తించిన ఎయిర్పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు
ఈ స్థలాన్ని ఎయిర్పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు సర్వే నిర్వహించి గ్రీన్ఫీల్డ్గా గుర్తించి విమానాశ్రయం ఏర్పాటుకు సానుకూలత వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వచ్చే 20 సంవత్సరాలకు విమానయానపరంగా ప్రయాణీకుల శాతం, పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న పరిస్థితి, భవిష్యత్లో పెరగనున్న ప్రయాణీకుల శాతాన్ని అంచనా వేస్తూ ఎయిర్పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి తాము పంపిన నివేదికలో వివరించారు. పారిశ్రామికంగా దినదినాభివృద్ధి చెందుతున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విమానాశ్రయం ఏర్పాటు చేస్తే ప్రస్తుతానికి దేశీయ విమానాలను నడపవచ్చని ఆ నివేదికలో పేర్కొంది.