ఖమ్మం ఎడ్యుకేషన్, జూన్ 25: ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు అమలు చేస్తున్నది. ఇప్పటికే మొదటి దశ ‘మన ఊరు- మన బడి’ పథకంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా వేలాది బడుల్లో మౌలిక వసతులు కల్పించింది. కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా తీర్చిదిద్దింది. విద్యార్థుల అడ్మిషన్ల కోసం విద్యాశాఖ ఈ నెల 3 నుంచి 17 వరకు ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట నిర్వహించింది. రెండో దశలో సోమవారం నుంచి వచ్చే నెల 6వరకు బడిబాట నిర్వహించనున్నది.
ఆకర్షిస్తున్న ‘ఇంగ్లిష్ మీడియం’..
ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటో తరగతితో పాటు ఆరో తరగతిలో విద్యార్థులు చేరడం అత్యంత కీలకం. ఇదే అంశాన్ని ప్రభుత్వం ప్రధానంగా తీసుకుని 1 నుంచి 6వ తరగతి చదివిన విద్యార్థులంతా తిరిగి సర్కార్ బడుల్లోనే చేరే విధంగా చర్యలు తీసుకున్నది. ఈమేరకు ఉపాధ్యాయులు గ్రామగ్రామానికి వెళ్లి కరపత్రాలు అందజేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలు చేరితే కలిగే ప్రయోజనాలను వివరిస్తున్నారు. విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం, పాఠ్యపుస్తకాలు, ఏకరూప దుస్తులు ఉచితంగా అందుతాయని తెలియజేస్తున్నారు. ఇంగ్లిష్ మీడియం అమలు చేస్తుండడంతో సర్కార్ బడుల్లో చేరే విద్యార్థుల సంఖ్య గతేడాది కంటే మెరుగ్గా ఉంది. కొందరు తల్లిదండ్రులు స్వయంగా పాఠశాలలకు వచ్చి తమ పిల్లలను చేర్పించడం విశేషం.
పాఠశాలల్లో మౌలిక వసతులు.
గతంలో పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు లేక తల్లిదండ్రులు తమ పిల్లలను సర్కార్ బడుల్లో చేర్పించే వారు కాదు. రాష్ట్ర సర్కార్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఇప్పుడు పాఠశాలల్లో టాయిలెట్లు, వంట గదుల వంటి మౌలిక వసతులు కల్పించడంతో సర్కార్ బడుల్లో చేరే విద్యార్థుల సంఖ్య ఏటికేడు పెరుగుతున్నది.
అడ్మిషన్లు ఇలా..
బడిబాటలో భాగంగా 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ప్రైవేట్ పాఠశాలల నుంచి సర్కార్ బడుల్లోకి 2,648 మంది చేరారు. అలాగే ఒకటో తరగతిలో కొత్తగా 3,847 మంది విద్యార్థులకు అడ్మిషన్ లభించింది. వీరిలో అంగన్వాడీ కేంద్రాల నుంచి 3,288 మంది, ప్రైవేట్ స్కూల్స్ నుంచి 275 మంది, డైరెక్ట్గా 284 మంది అడ్మిషన్లు తీసుకున్నారు.
ఆకట్టుకుంటున్న నినాదాలు…
బడిబాటలో ఉపాధ్యాయుల ర్యాలీలు నినాదాలు ఆకట్టుకుంటున్నాయి. ప్రభుత్వ బడి- అమ్మ ఒడి, సర్కార్ బడి పిల్లలు- సత్తా కలిగిన పిల్లలు, ప్రభుత్వ బడులు ముద్దు- ప్రైవేట్ బడులు వద్దు, సర్కార్ బడిలోనే చదివించండి- పిల్లల జీవితాల్లో వెలుగును పంచండి, ప్రభుత్వ బడిలో చేర్చు- మీ పిల్లవాడి తలరాత మార్చు, ఎక్కడికో ఎందుకు దండగ- ప్రభుత్వ బడి మన ఊరిలో ఉండగా.. అనే నినాదాలు గ్రామాల్లో హోరెత్తుతున్నాయి. ప్రజాప్రతినిధుల నుంచి ఉన్నతాధికారుల వరకు బడిబాటలో భాగస్వాములవుతున్నారు. జిల్లా విద్యాశాఖ అధికారి సోమశేఖరశర్మ, సీఎంవో రాజశేఖర్, జిల్లా అబ్జర్వర్ శ్రీనివాసాచారి నిత్యం కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. వచ్చే నెల 6వ తేదీ వరకు బడిబాట కొనసాగనున్నది.