ఆళ్లపల్లి, జనవరి 30: ఏజెన్సీ ప్రాంతాల అభివృద్ధే బీఆర్ఎస్ సర్కారు ధ్యేయమని ప్రభుత్వ విప్ రేగా కాంతారావు పేర్కొన్నారు. మారుమూల పల్లెల్లోనూ సీసీ రోడ్లు నిర్మించిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని అన్నారు. రూ.7.75 కోట్లతో చేపట్టిన ఆళ్లపల్లి – వెంకటాపురం బీటీ రోడ్డును, రూ.3.50 కోట్లతో నిర్మించిన పెద్ద వెంకటాపురం, రూ.5.25 కోట్లతో నిర్మించిన సీతానగరం బ్రిడ్జి, రూ.4.12 కోట్లతో నిర్మించిన బోడాయికుంట బ్రిడ్జిలను, పలు గ్రామాల్లో రూ.50 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లను సోమవారం ఆయన ప్రారంభించారు. అనంతోగు ఆశ్రమ పాఠశాలలో కంటి వెలుగు కార్యక్రమాన్ని పరిశీలించారు.
ఆళ్లపల్లి మండలంలో రూ.3 కోట్లతో నిర్మిస్తున్న కస్తూర్బా గాంధీ పాఠశాలను పరిశీలించారు. అనంతరం 14 మంది లబ్ధిదారులకు మర్కోడు రైతువేదికలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాక ముందు మారుమూల ఏజెన్సీ ప్రాంతమైన ఆళ్లపల్లి మండల ప్రజలు కనీస మౌలిక సదుపాయాలతోపాటు రోడ్లు, వంతెనలు లేక చాలా ఇబ్బందులు పడేవారని గుర్తుచేశారు. కానీ రాష్ట్రం ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ దీనిని ప్రత్యేక మండలం చేసి రోడ్లు, వంతెనలు, సీసీ రోడ్లతోపాటు పలు అభివృద్ధి చేపట్టారని వివరించారు. దీంతో ఆళ్లపల్లి మండలం అభివృద్ధి చెందిందని అన్నారు. సీఎం కేసీఆర్ లాంటి వ్యక్తి దేశానికి ప్రధానిగా వస్తే మన భారతదేశాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపిస్తారన్నారు.
ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు కొండ్రు మంజుభార్గవి, కొమరం హనుమంతరావు, సాదియా సుల్తానా, మంగమ్మ, కొమరం వెంకటేశ్వర్లు, గొగ్గల రామయ్య, వెంకటేశ్వర్లు, రాంబాబు, సైదుల్రెడ్డి, శంకర్బాబు, ప్రేమకళ, నరసింహారావు, కోటేశ్వరరావు, వెంకటనారాయణ, నిర్మల, పాయం నరసింహారావు, బాబా, ఖయ్యూం, వెంకటేశ్, సతీశ్, హఫీజ్, వెంకన్న, బాబు, సాయన్న తదితరులు పాల్గొన్నారు.