ఖమ్మం ఎడ్యుకేషన్, జూలై 18 : చదువుతోనే గౌరవం.. చదువుకుంటే భవిత బంగారం.. చదువుని మళ్లీ కొనసాగిద్దాం… సమాజంలో మనమూ గుర్తింపు పొందుదాం.. అనే నినాదాలతో రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ స్టేట్ ఓపెన్ స్కూల్ ఆధ్వర్యంలో దూరవిద్యా విధానాన్ని ప్రోత్సహిస్తున్నది. విద్య మనిషిని ఉన్నతుణ్ణి చేస్తుంది. విజ్ఞానం, సంస్కారం, సాంస్కృతిక వైఖరులను అందించే సాధనం విద్య. వర్తమాన వ్యవస్థలో సామాజిక అంతరాల వల్ల అందరూ చదువుకోలేకపోతున్నారు. ఆ లోపం వారిని అడుగడుగునా వెంటాడుతున్నది. పేదరికం పురుషుల కన్నా స్త్రీలను ఎక్కువగా బాధిస్తుంది. ఇలా కుటుంబాల్లో ఆర్థికశక్తి లేనప్పుడు ఆడపిల్లలకు చదువు చెప్పించరు. ఇటువంటి కారణాల వల్ల ఎంతోమంది విద్యకు దూరమైపోతున్నారు. విద్యకు దూరమైన వాళ్లు, ఉపాధి కోసం ఏదో ఒక వృత్తిలో ఉన్నవాళ్లు కూడా విద్యను పొందడానికి ఒక మార్గం ఉండాలనే సదుద్దేశంతో నిర్వహిస్తున్నదే ఓపెన్ స్కూల్ విద్య. ఓపెన్ స్కూల్ పేదవారికి ప్రభుత్వం అందిస్తున్న ఒక వరం. నిత్య జీవితానికి ఉపయోగపడేలా కాలానుగుణంగా విద్యా విషయక, వృత్తి విద్య సంబంధమైన కోర్సులు ప్రవేశపెట్టారు. జిల్లాలో ప్రతి సంవత్సరం వేలాదిమంది అభ్యాసకులకు టెన్త్, ఇంటర్ విద్య చదువుకునే అవకాశం కల్పిస్తూ వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్నది. ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి అడ్మిషన్ల ప్రక్రియ మొదలైంది.
మొత్తం 46 అధ్యయన కేంద్రాలు
విద్య ద్వారా ఉద్యోగ అవకాశాలు, ఉద్యోగోన్నతులు, ఉన్నత చదువులు అవసరమైన వారికి ఓపెన్ స్కూల్ విద్య వరంగా మారింది. ప్రభుత్వం అమలుచేస్తున్న ఈ విధానంపై ఎంతోమంది ఆసక్తి చూపుతున్నారు. ఈ విధానంలో చదువుకునేందుకు ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల్లో అధ్యయన కేంద్రాలు నిర్వహిస్తున్నారు. చదవడం, రాయడం తెలిసి 14 సంవత్సరాలు నిండిన వారందరికీ దూరవిద్య విధానంలో ప్రవేశాలు కల్పిస్తున్నారు. ఇందుకు ఖమ్మం జిల్లాలో 22, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 24 మొత్తం 46 అధ్యయన కేంద్రాలు అందుబాటులో ఉన్నాయి.
రుసుముల వివరాలు
పదో తరగతి జనరల్ కేటగిరీకి సంబంధించి పురుషుల ప్రవేశ రుసుం రూ.1,450కి దరఖాస్తు రుసుం రూ.100 కలిపి మొత్తం రూ.1,550 చెల్లించాలి. అన్ని కేటగిరీలకు సంబంధించిన మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ దివ్యాంగుల కేటగిరీల పురుషులు రూ.1,150 చెల్లించాలి. ఇంటర్ జనరల్ కేటగిరికి చెందిన వారైతే పురుషులు రూ.1800 చెల్లించాలి. ఇతర కేటగిరీలకు చెందిన వారు రూ.1,500 చెల్లించాలి. ఫీజులను ఆన్లైన్లో చెల్లించాలి. WWW.TELANGANA OPENSCHOOL.ORG వెబ్సైట్లో వివరాలు నమోదు చేయాలి. ఎలాంటి అపరాధ రుసుం లేకుండా ఆగస్టు 10వ తేదీ వరకు, అపరాధ రుసంతో ఆగస్టు 11 నుంచి 31వ తేదీ వరకు ఫీజులను చెల్లించవచ్చు.
నచ్చిన సబ్జెక్ట్ల ఎంపిక…
ఎస్ఎస్సీ, ఇంటర్మీడియట్లో బోధన విషయాలను మూడు గ్రూప్లుగా విభజించారు. గ్రూప్ ఏ-భాషలు, బీ-భాషేతర విషయాలు, గ్రూప్-సీలో వృత్తి విద్యాకోర్సులు ఉంటాయి. అధ్యాపకులే స్వయంగా బోధన విషయాలను బోధిస్తారు. గ్రూప్-ఏ, బీల నుంచి కనీసం రెండు సబ్జెక్ట్ల చొప్పున మొత్తం ఐదు సబ్జెక్ట్లు ఎంపిక చేసుకోవాలి. ఇంటర్ గ్రూప్-ఏలో భాషలు, గ్రూప్-బీలో ఆప్షనల్స్, గ్రూప్-సీలో విద్యాకోర్సులు ఉంటాయి. గ్రూప్-ఏ నుంచి ఇంగ్లిష్తోపాటు నచ్చిన భాషను ఎంపిక చేసుకోవాలి. గ్రూప్-సీలో తమకు నచ్చిన వృత్తి విద్యాకోర్సును ఎంపిక చేసుకోవచ్చు. అధ్యయన కేంద్రాల్లో అడ్మిషన్లు పొందిన అభ్యర్థులందరికి ఉచితంగా పుస్తకాలు అందిస్తారు. వారికి ప్రతి ఆదివారం, రెండో శనివారం తరగతులు నిర్వహిస్తారు. పుస్తకాలను ఇంటివద్ద చదువుకొని రావాలి. సందేహాలను తరగతుల సమయంలో అధ్యాపకులు తీరుస్తారు. కేంద్రంలో టెన్త్కి 20 మంది, ఇంటర్కు 25 మంది ఉంటే అధ్యయన కేంద్రంలో తరగతులు నిర్వహిస్తారు. 30 తరగతుల్లో అభ్యాసకులు తప్పనిసరిగా 24 తరగతులకు హాజరుకావాలి.
అర్హతలు
ఓపెన్ స్కూల్ విద్యలో పదో తరగతిలో ప్రవేశం పొందేందుకు 2023 ఆగస్టు నాటికి 14 సంవత్సరాలు, ఇంటర్లో ప్రవేశం పొందేందుకు 15 సంవత్సరాలు నిండి ఉండాలి. ప్రవేశాలకు గరిష్ఠ పరిమితి లేదు. ఇంటర్లో చేరేందుకు పది ఉత్తీర్ణులై ఉండాలి. దరఖాస్తుతోపాటు వయస్సు ధ్రువీకరణ పత్రం అందజేయాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగుల కేటగిరీలకు చెందిన అభ్యాసకులు ఆయా కేటగిరీలకు సంబంధించిన పత్రాలను జత చేయాలి. ఈ ధ్రువపత్రాలు రెగ్యులర్గా ఉత్తీర్ణులైన వారికి ఇచ్చేవాటితో సమానం. ఉన్నత చదువులు, ఉద్యోగాలకు సైతం అర్హత కల్పిస్తోంది. 2023-24 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభించారు.
సద్వినియోగం చేసుకోవాలి
ఓపెన్ స్కూల్ విద్యా విధానంలో ఇంటివద్దనే చదువుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పిస్తున్నది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. రెగ్యులర్ విద్యతో సమానంగా గుర్తింపు ఉన్నందున అభ్యాసకులు ఆసక్తి కనబరుస్తున్నారు. చదువుకోలేదనే చింతను ఓపెన్ స్కూల్ తొలగిస్తుంది. అందరికీ చదువు నినాదంతో ప్రభుత్వం ముందుకెళ్తున్నది.
– సోమశేఖరశర్మ, డీఈవో
కనీస ఫీజుతోనే ప్రవేశాలు
పదో తరగతి, ఇంటర్మీడియట్లో ఓపెన్ స్కూల్ ప్రవేశాలను కనీస ఫీజుతోనే రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పిస్తున్నది. వివిధ రకాల మాధ్యమాల్లో ఓపెన్ స్కూల్ విధానం నిర్వహిస్తున్నారు. విద్యార్హతను పెంచుకునేందుకు ఓపెన్ స్కూల్ చక్కటి అవకాశం. చిన్న, చిన్న ఉద్యోగాలు చేసుకునే వారు సైతం ఓపెన్ స్కూల్లో చదివి ప్రమోషన్లు పొందుతున్నారు.
– ఎం. పాపారావు, రెండు జిల్లాల కోఆర్డినేటర్