పెనుబల్లి : హరితహారం కార్యక్రమంలో భాగంగా జాతీయ రహదారికి ఇరువైపులా నాటిన మొక్కలను రక్షించే బాధ్యత ఆయా గ్రామాల సర్పంచ్లపై ఉందని అడిషనల్ డీఆర్డీఓ శిరీష అన్నారు. మంగళవారం మండలపరిధిలోని గౌరారం నుంచి ముత్తగూడెం వరకు 9 గ్రామపంచాయితీల్లో నాటిన మొక్కలను క్షేత్రస్థాయిలో ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామీణ రహదారులు, జాతీయ రహదారుల ఇరువైపులా నాటిన మొక్కలను పంచాయితీ సిబ్బంది ఎప్పటికప్పుడు పరిశీలించి పూర్తిస్థాయిలో సంరక్షించే బాధ్యత తీసుకోవాలని అన్నారు.
జాతీయ రహదారులకు మూడువైపులా వరుస మొక్కలను, అంతర్గత రోడ్లకు ఒక వరుసలో మొక్కలను నాటించాలని, నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలన్నారు. క్షేత్రస్థాయిలో అధికారులు, ప్రజాప్రతినిధులు దృష్టి సారించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ కావూరి మహాలక్ష్మీ,ఈజీఎస్ జేఈ మధుసూదన్, స్థానిక సర్పంచ్లు, ఈజీఎస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.