ఖమ్మం : ఖమ్మం జిల్లాలో నవంబర్ నెలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం అవుతాయని జిల్లా అదనపు కలెక్టర్ మధుసూధన్రావు తెలిపారు. దీని కోసం విస్తరణ అధికారులు వారికి కెటాయించిన కేంద్రాలలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని, లేకాపోతే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. కలెక్టర్ ఆదేశానుసారం యాసంగి సీజన్లో వరి పంటకు ప్రత్యామ్నాయ పంటలపై వ్యవసాయ శాఖ అధికారులకు నగరంలోని జిల్లా పంచాయితీ వనరుల కేంద్రంలో మంగళవారం నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిధిగా పాల్గొని మాట్లాడారు. వరికి బదులుగా నూనె గింజల పంటలైన వేరుశనగ, పొద్దుతిరుగుడు, నువ్వులు, శనగ, మినుములు, పెసర, బొబ్బర్లు పంటలు వేయాలని అన్నారు.
జిల్లా వ్యవసాయ శాఖ అధికారి యం.విజయనిర్మల మాట్లాడుతూ కమిషనర్ కార్యాలయం నుంచి వచ్చే ఆదేశాల ప్రకారం వ్యవసాయ శాఖ అధికారులు అందరూ రైతు వేదికల్లో మూడు రోజుల పాటు ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని, వీటిలో రైతు సమన్వయసమితి సభ్యులను ఆహ్వానించాలని అన్నారు. పంటకల్లాలు, వరి కొనుగోలు కేంద్రాలై దృష్టి సారించాలని చెప్పారు. డిఆర్డీఓ విధ్యాచందన మాట్లాడతూ రైతు కల్లాలు, వాటి ఉపయోగాల గురించి వివరించారు.
ఉపాధి హామీ సిబ్బందితో కలిసి విస్తరణ అధికారులు రైతులకు, కల్లాలపై అవగాహన కల్పించి మండలాల వారిగా కెటాయించిన లక్ష్యాలను పూర్తి చేయాలని అన్నారు. కెవికే ప్రొగ్రాం కో-ఆర్డినేటర్ జే.హేమంత్కుమార్ మాట్లాడుతూ జిల్లాకు అవసరమైన పంటరకాలను, విత్తన మోతాదు, పంట కాలం, సస్యరక్షణ చర్యల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో శాస్త్రవేత్తలు రుక్మిణీదేవి, డాక్టర్ శ్రీనివాసరావు,డాక్టర్ రవికుమార్, వ్యవసాయ శాఖ, ఉధ్యానవన శాఖ సిబ్బంది, శాస్త్రవేత్తలు తదితరులు పాల్గొన్నారు.