వైరాటౌన్, మార్చి 23 : సెక్టార్ అధికారులు పోలింగ్ కేంద్రాలను సందర్శించి మౌలిక వసతులు కల్పించేందుకు కృషి చేయాలని అదనపు కలెక్టర్ సత్యప్రసాద్ ఆదేశించారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో వైరా మండల కేంద్రంలో సెక్టార్ అధికారులతో శనివారం ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మే నెలలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల కోసం పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేయాలని, వాటిలో అన్ని సౌకర్యాలు ఉన్నాయో.. లేదో పరిశీలించాలన్నారు.
ఎలాంటి ఇబ్బంది లేకుండా ఓటర్లు ప్రశాంత వాతావరణంలో ఓటు వేసేలా ఉండాలన్నారు. నియోజకవర్గంలోని ఐదు మండలాలకు చెందిన రూట్ మ్యాప్లను పరిశీలించాలని కోరారు. పోలింగ్ కేంద్రాల్లో ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తేవాలని కోరారు. కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాసరావు, ఐదు మండలాల సెక్టార్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు