ఖమ్మం: జిల్లాలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న గ్రీన్పీల్డ్ హైవే నిర్మాణంలో భూములు కోల్పోయిన రైతులకు జాతీయ రహదారుల ప్రాతిపాధిక సంస్థ (నేషనల్ హైవే అథార్టీ)నుంచి మంజూరు చేసిన నష్ట పరిహారం చెల్లింపును వేగవంతం చేశామని జిల్లా అదనపు కలెక్టర్ అన్ మధుసూదన్ తెలిపారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని అదనపు కలెక్టర్ చాంబార్లో గ్రీన్ఫీల్డ్ హైవే భూసేకరణ, నష్టపరిహారం చెల్లింపుపై ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. జిల్లాలో ఖమ్మం రూరల్ మండలంలోని పొన్నెకల్ గ్రామం నుంచి సత్తుపల్లి నియోజకరవర్గంలోని వేంసూరు మండలంలోని జిల్లా సరిహద్దు గ్రామం వరకు 92 కిలోమీటర్ల పోడవుతో 60 మీటర్ల వెడల్పుతో గ్రీన్ఫీల్డ్ హైవేకు అవసరమైన భూసేకరణ పనులు వేగవంతం చేశామన్నారు.
జిల్లా వ్యాప్తంగా జాతీయ రహాదారుల ప్రాతిపాధిక సంస్థ ప్రతిపాధించిన 31 గ్రామాలలో 1356.20ఎకరాల భూమిని 3371 మంది రైతుల నుంచి సేకరించామని తెలిపారు. ఈ భూసేకరణలో భూములు కోల్పోయిన మొత్తం రైతులకు సగటున సుమారు ఎకరాకు రూ. 22 లక్షల 50 వేల చొప్పున చెల్లిస్తున్నామని వివరించారు. ఇప్పటికే సత్తుపల్లి నియోజక వర్గంలోని పెనుబల్లి మండలంలోని కోండ్రుపాడు, సత్తుపల్లి మండంలోని సదాశివునిపాలెం, తుంబూరు రెవిన్యూ గ్రామాలకు చెందిన 180 మంది రైతుల నుంచి సేకరించిన 66 ఎకరాల భూమికి రూ.16 కోట్లు చెల్లించామన్నారు. దీంతో పాటు తల్లాడ మండలంలోని రామానుజవరం రెవిన్యూ గ్రామంలో 34 మంది రైతుల నుంచి సేకరించిన 23.20ఎకరాల భూమికి రెండు రోజుల్లో రూ.5.57 కోట్లు నష్ట పరిహారం రైతుల ఖాతాల్లో జమ చేస్తామని తెలిపారు.