పాల్వంచ, మార్చి 26 : రాష్ట్రంలో బీజేపీ అడుగుపెట్టకుండా నిలువరించే సత్తా కమ్యూనిస్టులకే ఉందని, సిట్టింగ్ స్థానాల్లోనూ బీజేపీ అభ్యర్థులు గెలవకుండా ప్రజలను చైతన్యవంతం చేసి అడ్డుకొని తీరుతామని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. కొత్తగూడెం నియోజకవర్గ స్థాయి ముఖ్యనాయకుల సమావేశం మంగళవారం పాల్వంచ చండ్ర రాజేశ్వరరావు భవన్లో జరిగింది. ముఖ్యఅతిథిగా హాజరైన కూనంనేని మాట్లాడుతూ పదేళ్ల మోదీ పాలన ప్రభుత్వరంగ సంస్థలను కార్పొరేట్ శక్తులకు అప్పనంగా కట్టబెట్టడంతోనే సాగిందన్నారు. కులాలు, మతాల మధ్య చిచ్చుపెడుతూ పబ్బం గడుపుతున్నారని అన్నారు. దేశంలో ఆర్థిక అసమానతలు పెరిగిపోతున్నాయని, దేశంలో ఉన్నవాడు మరింత ఉన్నవాడుగా మారుతుండగా పేదలు మాత్రం బీదలుగా, కనీసం రెండుపూటలా తిండి తినలేని దౌర్భాగ్య పరిస్థితులు ఏర్పడుతున్నాయన్నారు. మోదీని గద్దెదింపే లక్ష్యంతో కార్యకర్తలు పనిచేయాలన్నారు. కార్యక్రమంలో సాబీర్పాషా, ముత్యాల విశ్వనాథం, సలిగంటి శ్రీనివాస్, డి.శేషయ్య, వీసంశెట్టి పూర్ణచందర్రావు, అడుసుమల్లి సాయిబాబా, వాసిరెడ్డి మురళి పాల్గొన్నారు.