‘రఘునాథ పాలెం మండలంలో రూ.260 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టాం.. బీఆర్ఎస్ నాయకులు కాలర్ ఎత్తుకుని తిరిగేలా గ్రామ గ్రామాన్ని తీర్చిదిద్దాం.. ప్రతి కార్యకర్త తలెత్తుకుని ప్రజలను ఓటు అడిగేలా పనిచేశాం.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం మనదే.. పార్టీపై వ్యతిరేక ప్రచారం చేసే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలి.. వారి కుతంత్రాలను తిప్పికొట్టాలి’ అని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పిలుపునిచ్చారు. మంచుకొండ గ్రామంలో ఆదివారం నిర్వహించిన పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. తెలంగాణను సాధించేందుకు కేసీఆర్ చావు నోట్లో తలపెట్టారన్నారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎదుర్కొని స్వరాష్ర్టాన్ని సాధించారన్నారు.. కార్యకర్తలే బీఆర్ఎస్కు మూలస్తంభాలని, కేసీఆర్ను మూడోసారి ముఖ్యమంత్రిని చేసేందుకు సైనికుడిలా పనిచేయాలన్నారు.
రఘునాథపాలెం, మే 7 : బీఆర్ఎస్కు కార్యకర్తలే మూలస్తంభాలని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. మంచుకొండలో ఆదివారం పార్టీ మండల అధ్యక్షుడు ఆజ్మీరా వీరూనాయక్ అధ్యక్షతన నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి అంటే ఇలా ఉండాలనే విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో అభివృద్ధి పనులు చేపట్టారని, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారన్నారు. ఒక్కో జిల్లాకు రూ.వేల కోట్లు కేటాయించి, అభివృద్ధిలో ముందంజలో ఉంచారని కొనియాడారు. రాష్ట్ర ప్రజలను ఓట్లడిగే హక్కు ఒక్క బీఆర్ఎస్కే ఉందన్నారు.
మరే పార్టీకీ ఓటు అడిగే హక్కు లేదన్నారు. తెలంగాణను సాధించేందుకు కేసీఆర్ చావు నోట్లో తలపెట్టారన్నారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎదుర్కొన్నారన్నారు. పదవులు దక్కలేదనే అసంతృప్తితో కొందరు పార్టీపై వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తాను ప్రజల ఆశీర్వాదంతో ఎన్నికల్లో గెలిచానన్నారు. ప్రజాసంక్షేమం కోసమే పనిచేస్తున్నామన్నారు. ప్రత్యేక చొరవ తీసుకుని సుమారు రూ.260 కోట్ల నిధులతో రఘునాథపాలెం మండలంలో అభివృద్ధి పనులు చేపట్టానన్నారు. గ్రామాల్లో కార్యకర్తలు కాలర్ ఎగురవేసేలా గ్రామాలను తీర్చిదిద్దానన్నారు. ప్రతి కార్యకర్త తలెత్తుకుని ఓట్లడిగే విధంగా పని చేశానన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం ఖాయమన్నారు. తాను మండలంలో చేసిన అభివృద్ధే వచ్చే ఎన్నికల్లో గెలిపిస్తుందన్నారు. ప్రజలంతా కేసీఆర్ వైపే ఉన్నారన్నారు.
నేషనల్ హైవే అథారిటీ ఆధ్వర్యంలో మట్టి తవ్వకాలు పూర్తయిన వెంటనే చదును అయిన భూమిని ఇండ్లు లేని పేదలకు కేటాయిస్తామన్నారు. గృహలక్ష్మి పథకం ద్వారా రూ.3 లక్షలతో ఇల్లు కట్టించి ఇస్తామన్నారు. సమావేశంలో డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, సుడా చైర్మన్ బచ్చు విజయ్కుమార్, వైస్ ఎంపీపీ గుత్తా రవి, బీఆర్ఎస్ ఖమ్మం నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు, ఏఎంసీ మాజీ చైర్మన్ మద్దినేని వెంకటరమణ, మంచుకొండ సొసైటీ చైర్మన్ మందడపు సుధాకర్, ఆత్మ చైర్మన్ లక్ష్మణ్ నాయక్, ముఖ్యనేతలు మందడపు నర్సింహారావు, కొంటెముక్కల వెంకటేశ్వర్లు, పిన్ని కోటేశ్వరరావు, బానోత్ ప్రమీల, కుర్రా భాస్కర్రావు, కాంపాటి రవి, నాయకులు చెరుకూరి ప్రదీప్, మెంటెం రామారావు, మంద సంజీవరావు, తాతా వెంకటేశ్వర్లు, సూదగాని సంగయ్య, బానోతు శివలాల్, తేజావత్ రమేశ్, బండి వెంకన్న, అజయ్. మీరా, వెంకటప్పారావు పాల్గొన్నారు
బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం ఖాయం..
రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ ఏదో ఒక సంక్షేమ పథకం అందుతున్నది. కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి సంక్షేమ పథకాలను వివరించాలి. కేసీఆర్ను గద్దె దించే సత్తా ఏ పార్టీకి లేదు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం ఖాయం. దేశంలోని మరే ఇతర రాష్ట్రంలోనూ తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు అమలు కావడం లేదు. ఇప్పుడు యావత్ దేశం రాష్ట్రం వైపే చూస్తున్నది. కార్యకర్తలు పార్టీని మరింత బలోపేతం చేయాలి. మేం పదవులు అనుభవిస్తున్నామంటే అది కార్యకర్తల పుణ్యమే. కేంద్రంలోని బీజేపీ ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదు. రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆ పార్టీ ఎంపీలు రాష్ర్టానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులు గురించి ఏమాత్రం పట్టించుకోవడం లేదు. వాటి గురించి కనీసం పార్లమెంటులో ప్రస్తావించడం లేదు.
– ఎంపీ నామా నాగేశ్వరరావు