– సీతారామ ప్రాజెక్ట్పై కార్యాచరణ ప్రకటించాలి
– సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యుడు కొండబోయిన నాగేశ్వరరావు
కారేపల్లి, జూలై 07 : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖమ్మం జిల్లాకు సభలతో సరిపుచ్చుతున్నారని, సమస్యలు గాలికొదిలేస్తున్నారని సీపీఐ(ఎం) ఖమ్మం జిల్లా కమిటీ సభ్యుడు కొండబోయిన నాగేశ్వరరావు విమర్శించారు. మంగళవారం మండల కార్యదర్శి కె.నరేంద్ర అధ్యక్షతన ఉసిరికాయలపల్లిలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 9న సీఎం రేవంత్ రెడ్డి ఖమ్మం జిల్లా చింతకాని మండలం జగన్నాధపురంలో రైతు ఆశీర్వాద సభ నిర్వహించనున్నారని, గతంలో మూడు పర్యాలు ఖమ్మం జిల్లా పర్యటనకు వచ్చి ఏమి చేశారని ప్రశ్నించారు. జిల్లాలో సీతరామ ప్రాజెక్ట్ నీటిని పారించుటకు నిధులను వరదలా విడుదల చేస్తానని హామీ ఇచ్చి ఏడాది గడుస్తున్నా పూర్తి నిధులు విడుదల చేయదన్నారు. రైతు రుణమాఫీ, భరోసా నిధులు సక్రమంగా ఇవ్వకుండా ఎగ్గొట్టడమే కాక కనీసం రైతులకు యూరియా సరఫరా చేయలేని స్థితిలో సీఎం ఉన్నారన్నారు. ఎలాంటి సాగునీరు సౌకర్యం లేని ఎడారి ప్రాంతాలుగా సింగరేణి, కామేపల్లి రఘునాథపాలెం మండలాలు ఉన్నాయని సీతారామ ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను అందించాలంటే జూలూరుపాడు వర్ధ గుట్టపై టెన్నల్ తవ్వకం ప్రారంభించి మండలాలకు సాగు నీరు అందించే విషయం మరిచారన్నారు.
జిల్లాలో ఉన్న ముగ్గురు మంత్రులు మూడు కాలువలు పంచుకుని వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాంట్రాక్టర్లను టెండర్లు పిలిచుకుని ప్రాంతాల స్వార్థానికి పరిమితమైనారని విమర్శించారు. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా సాగు నీరుని అందించాలని చిత్తశుద్ధి మంత్రులకు లేదన్నారు. ఈ నెల 9న చింతకాని జగన్నాధపురంలో జరిగే ముఖ్యమంత్రి సభలో సీతారామ నిధులు విడుదల చేయడంతో పాటు చిత్తశుద్ధితో ప్రాజెక్టు పనులు త్వరగా పూర్తి చేసేలా కార్యచరణ ప్రకటించాలని డిమాండ్ చేశారు. జిల్లాలో అత్యధిక మంది పోడు సాగుపై ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నారని గతంలో సిపిఐ(ఎం) చేసిన ఆందోళన పోరాట ఫలితంగా గత ప్రభుత్వం హక్కు పత్రాలు ఇచ్చుటకు అంగీకరించి సర్వే నిర్వహించారన్నారు. గిరిజనులకు మాత్రమే హక్కు పత్రాలు ఇచ్చి గిరిజనేతర సాగుదారులకు హక్కు పత్రాలు ఇవ్వడం మర్చిపోయారన్నారు. సర్వే పూర్తియి హక్కు పత్రాల కోసం ఎదురు చూస్తున్న గిరిజనేతర పోడు రైతులకు హక్కు పత్రాలు ఎప్పుడు ఇస్తారో స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. సింగరేణి కోల్ మైన్స్ మాదారం స్టీల్ ప్లాంట్ డోలమైట్ మైనింగ్ సంస్థల నుండి అభివృద్ధి నిధులను తీసుకువచ్చే అవకాశాన్ని ప్రస్తుతం జిల్లా మంత్రులు నియోజకవర్గ శాసనసభ్యులు పట్టించుకోవడం లేదని, ముఖ్యమంత్రి జోక్యం చేసుకొని ఆ సంస్థల ద్వారా అభివృద్ధి నిధులను మంజూరు చేయించి సింగరేణి మండల కేంద్రంతో పాటు పరిసర ప్రాంతాల అభివృద్ధికి కృషి చేయాలని ఆయన కోరారు.
ఇందిరమ్మ ఇండ్లు మొదటి దఫాలో అరకొరగా అందినాయని, రెండో దఫాలో లబ్ధిదారులందరికి ఒకేసారి ఇండ్లు మంజూరు చేయాలన్నారు. సీఎం సభలు పెట్టి సర్దుకొని పోతే సరిపోదని గత పర్యటనలో ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయలేదో, ప్రస్తుతం ఇచ్చే హామీలు ఎలా అమలు చేస్తారో తెల్పాలని లేకుంటే ప్రజలు నిలదీయడం సిద్ధంగా ఉన్నారన్నారు. ఈ సమావేశంలో సీపీఐ(ఎం) నాయకులు వజ్జా రామారావు, బానోత్ బన్సీలాల్, కొండబోయిన ఉమావతి, దాసరి మల్లయ్య, తేజావత్ చందర్, యనమనగండ్ల రవి, కేశగాని ఉపేందర్, వల్లభినేని మురళి, రేగళ్ల మంగయ్య, పండగ కొండయ్య, అజ్మీర శోభన్, కొత్తూరి రామారావు, సురబాక సర్వయ్య, తలారి దేవ ప్రకాష్, రేమల్ల వీరస్వామి, ముండ్ల ఏకాంబరం, వడ్డే అజయ్ బాబు, దారావత్ వినోద్, కరపట్టి సీతారాములు, మద్దెల నాగయ్య, పాసిన్ని నాగేశ్వరరావు, వల్లబోయిన కొండలరావు, కరకపల్లి రాయమల్లు, షేక్ సైదులు, ముక్క సీతారాములు పాల్గొన్నారు.